`ఒకవేళ భదత్రా పరిస్థితి బాగుంటే.. బీజేపీ నేతలు జమ్ము నుంచి లాల్చౌక్ వరకు ఎందుకు నడవరు`
జమ్ముకశ్మీర్లో భద్రతపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఒకవేళ భదత్రా పరిస్థితి బాగుంటే.. బీజేపీ నేతలు జమ్ము నుంచి లాల్చౌక్ వరకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.
జమ్ముకశ్మీర్లో భద్రత విషయంలో కేంద్రం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ.. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత .. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మెరుగుపడలేదని అన్నారు. కాశ్మీర్ భద్రత పరిస్థితిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లక్షిత హత్యలు, బాంబు పేలుళ్లు నిరంతరం జరుగుతున్నాయని, అక్కడ పరిస్థితి మెరుగుపడిందని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ వాదనను తీవ్రంగా తప్పుబడ్డారు. `ఒకవేళ జమ్ముకశ్మీర్లో పరిస్థితి బాగుంటే.. జమ్మూ నుంచి లాల్ చౌక్కు బీజేపీ వాళ్లు ఎందుకు వెళ్లరు?’ అని ప్రశ్నించారు. పరిస్థితి అంత సురక్షితంగా ఉంటే.. కేంద్ర మంత్రి అమిత్ షా జమ్మూ నుంచి కాశ్మీర్కు ఎందుకు వెళ్లరు? అని నిలాదీశారు. కాబట్టి అక్కడ భద్రత పరిస్థితులు మెరుగు పడ్డాయనే వాదన సరైనది కాదు" అని అన్నారు. వైఫల్యం పేరుతో శుక్రవారం రాహుల్ గాంధీ తన జోడో యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు.
అలాగే.. భారత్-చైనా ప్రతిష్టంభనపై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. చైనాతో భారత్ మరింత కఠినంగా వ్యవహరించాలని,వారు మన భూమిని ఆక్రమిస్తున్నారని, ఆ చర్యను తాము ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేయాలని అన్నారు.
శ్రీనగర్లోని లాల్చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ డ్రాగన్ కంట్రీ చైనా.. భారత భూమిని స్వాధీనం చేసుకోలేదని భావిస్తున్న ఏకైక వ్యక్తి ప్రధానినేననీ విమర్శించారు. తాను ఇటీవల కొంతమంది మాజీ సైనికులను, లడఖ్ లోని కొంతమంది ప్రతినిధి బృందాన్ని కూడా కలిశానని తెలిపారు. వారు 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అనేక పెట్రోలింగ్ పాయింట్లు చైనా ఆక్రమించిందని స్పష్టంగా తెలిపారని అన్నారు.
చైనాతో వ్యవహరించే మార్గమేమిటంటే.. భారత భూమిని తాము ఆక్రమిస్తున్నామని గట్టిగా, స్పష్టంగా చెప్పడమే మార్గమని, భారత భూ భాగాన్ని ఆక్రమిస్తే.. సహించబోమని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జమ్మూ కాశ్మీర్ గుండా వెళుతున్నప్పుడు..అక్కడి ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని, అక్కడి ప్రజలు చాలా బాధపడుతున్నారని, అధికార పార్టీ చేసిన 'నయా కాశ్మీర్' నినాదానికి ఎటువంటి ఆధారం లేదని రాహుల్ గాంధీ అన్నారు.
దాదాపు 75 ఏళ్ల క్రితం లాల్చౌక్లో తన ముత్తాత స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చారిత్రక ఘట్టం గుర్తుకు వస్తుందనీ, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని చూస్తుంటే బాధగా ఉందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ, రాష్ట్ర హోదా పునరుద్ధరణ అనివార్యమని, ఇది జమ్మూకశ్మీర్ పౌరుల ప్రాథమిక హక్కు అని రాహుల్ అన్నారు. బీజేపీని టార్గెట్ చేస్తూ.. దేశంలోని సీబీఐ, ఏసీబీ వంటి స్వయం ప్రతిపతి సంస్థలను బీజేపీ నాశనం చేసిందని ఆరోపించారు. దేశంలోని మౌలిక సదుపాయాలు, న్యాయవ్యవస్థ, మీడియా మొదలైన వాటిపై కూడా బీజేపీ దాడి చేసిందనీ, ఇందుకు జమ్మూ కాశ్మీర్లో ఏమి జరుగుతుందో అదే నిదర్శనమని అన్నారు. పార్లమెంట్లో ఇలాంటి విషయాలను మాట్లాడితే మైక్లు కట్ చేస్తారని ఆరోపించారు.