Rahul Gandhi: ఇంటి చిరునామాలో ప్రజా సంక్షేమం(లోక్ కల్యాణ్ మార్గ్) అని పెట్టుకున్నంత మాత్రానికి సరిపోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శ‌లు గుప్పించారు. ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటును తగ్గించిన తీవ్రంగా వ్య‌తిరేకించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.  

Rahul Gandhi: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతా డిపాజిట్లపై ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించ‌డానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇంటి చిరునామాలో ప్రజా సంక్షేమం ‘‘లోక్ కల్యాణ్ మార్గ్’’ ( Lok Kalyan Marg) అని పెట్టుకున్నంత మాత్రానికి ప్రజలకు సంక్షేమం జరగదని ప్ర‌ధాని మోడీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు.

6.5 కోట్ల మంది ఉద్యోగుల వర్తమానాన్ని, భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రధాని ద్రవ్యోల్బణం పెంపు, ఆదాయాలు తగ్గుదల నమూనాను అమలు చేశారని రాహుల్ విమ‌ర్శించారు. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటు సవరణకు సంబంధించిన వార్తా కథనాల‌ను ట్వీట్ కు జ‌త చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ప్రధాని నివాస చిరునామా 7 రేస్ కోర్స్ రోడ్ (7 RCR)గా ఉండేది. దీనిని 2016లో BJP ప్రభుత్వం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చింది. 

రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా స్పందించారు. 'తన అకృత్యాలు స్వయంగా గుర్తించిన మోడీ.. 'లోక్ కళ్యాణ్ మార్గ్' పేరు పెట్టడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడని, అందుకే ఇప్పుడు తన కోసం వేల కోట్లతో 'మోదీ మహల్' నిర్మిస్తున్నాడని విమ‌ర్శించారు.
 ప్రస్తుతం నిర్మితమవుతున్న నూతన పార్ల‌మెంట్, తదితర పరిపాలనా భవనాలతో కూడిన సెంట్రల్ విస్టా అవెన్యూను పని వేగంగా సాగుతున్నాయి. ఈ విష‌యాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్త‌విస్తూ.. రాహుల్ చేసిన‌ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కి చెందిన దాదాపు 6 కోట్ల మంది చందాదారులకు 2021-22 సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీని చెల్లించడానికి ప్రభుత్వం ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాల్లో ఈపీఎఫ్‌పై లభించే అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. ఈ ఏడాది మార్చిలోనే, EPFO ​​యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2021-22కి చెల్లించాల్సిన వడ్డీ రేటును 2020-21కి 8.5 శాతం నుండి 8.1 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది.

ఈపీఎఫ్‌ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాల‌ని మార్చ్ నెల‌లో ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్‌(ఈపీఎఫ్ఓ) నిర్ణ‌యించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న 8.5% వ‌డ్డీ రేటును 8.1 శాతానికి త‌గ్గించాల‌ని నిర్ణ‌యిస్తూ, ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రానికి పంపించింది. ఈ ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇది వర్తిస్తుంది. ఇంత తక్కువ వడ్డీ రేటు ఉండటం 40 ఏళ్ళలో ఇదే మొదటిసారి. 1977-78లో ఈ వడ్డీ రేటు 8 శాతం ఉండేది. ఆ త‌రువాత‌, అంత త‌క్కువ వ‌డ్డీ రేటు ఇంత‌వ‌ర‌కు లేదు. 2018-19లో ఈపీఎఫ్ వ‌డ్డీ రేటు 8.65%గా ఉంది. ఆ త‌రువాత‌, 2019-20లో అది 8.5 శాతానికి త‌గ్గింది. ఈ వ‌డ్డీ రేటు 2014-15లో 8.75%గా, 2015-16లో 8.80%గా ఉంది.