బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లల్ని పుట్టించలేననే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదని వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సొంత పార్టీ నాయకులు కూడా కటిల్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిల్లలను కనలేనందునే పెళ్లి చేసుకోవడం లేదని కర్ణాటక బీజేపీ చీఫ్, లోక్ సభ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ ‘విజయ సంకల్ప యాత్ర’లో భాగంగా రాహుల్ గాంధీపై వ్యక్తిగత దాడికి దిగారు. రామనగరలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ -19 వ్యాక్సిన్లపై కాంగ్రెస్ నాయకులు మొదట్లో ప్రతిఘటించడంపై విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ, సిద్దరామయ్య వ్యాక్సిన్లు తీసుకోవద్దని మొదట చెప్పారని, కానీ వారే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరని చెప్పి ఇద్దరు కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తాను చెబుతానని అన్నారు. రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని తెలుసని అందుకే పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని సభాముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. కటీల్ కు తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయని విమర్శించింది. ‘‘నళిన్ కటిల్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయనకు తీవ్రమైన మానసిక సమస్యలున్నాయని, తెలివితేటలు తక్కువగా ఉన్న ఆయన వ్యాధి పార్టీ మొత్తానికి వ్యాపిస్తోందని తెలుస్తోంది. త్వరగా కోలుకోండి బీజేపీ’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ కమ్యూనికేషన్స్ విభాగం అధిపతి ప్రియాంక్ ఖర్గే ట్వీట్ చేశారు.
హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులపై దాడి.. పాకిస్థాన్లోని లాహోర్లో ఘటన
అయితే బీజేపీ కూడా కటీల్ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వదల్చుకోలేదని తెలిపింది. తమ అధ్యక్షుడు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్య చేశారో తనకు తెలియదని, అయితే ఈ వ్యాఖ్యకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, ఈ వ్యాఖ్యలను తాను సమర్థించదలుచుకోలేదని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. రోడ్లు, మురుగునీరు వంటి చిన్న చిన్న సమస్యలపై కాకుండా లవ్ జిహాద్ వంటి అంశాలపై దృష్టి సారించాలని గత నెలలో కటీల్ తన పార్టీ కార్యకర్తలకు సూచించారు.
