కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో 'మోడీ మోడీ' అంటూ నినాదాలు.. రాహుల్ గాంధీ ఏం చేశారంటే..
Madhya Pradesh: కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో 'మోడీ మోడీ' అంటూ నినాదాలు చేస్తున్న ఒక గుంపు ప్రేక్షకులకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ చేతులెత్తి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Rahul Gandhi gives flying kiss to crowd: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశవ్యాప్త భారత్ జోడో యాత్రలో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే, మధ్యప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర కొనసాగుతుండగా చోటుచేసుకున్న ఒక ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వాలో ఆదివారం జరిగిన భారత్ జోడో యాత్రలో కొంతమందితో కూడిన గుంపు 'మోడీ మోడీ' అంటూ నినాదాలు చేయడం కనిపించింది. ఈ క్రమంలోనే అక్కడ రాహుల్ గాంధీ.. మోడీ మోడీ అంటూ నినాదాలు చేస్తున్న వ్యక్తుల వైపు చూస్తూ.. చేతులెత్తి వారికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. తనతో కలిసి ముందుకు నడుస్తున్న వారు తిరిగి రావాలని కోరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా, ఆదివారం నాడు మధ్యప్రదేశ్ లో కొనసాగిన భారత్ జోడో యాత్ర.. సాయంత్రానికి ఆ రాష్ట్రంలో పాదయాత్రను ముగించుకుంది. ఇక సోమవారం ఉదయం రాహుల్ గాంధీ రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఝలావర్లోని ఝల్రాపటన్లోని కాళీ తలై నుంచి యాత్ర ప్రారంభమైంది.ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీతో కలిపి భారత్ జోడో యాత్రలో పాలుపంచుకున్నారు.
రాజస్థానల్ లో భారత్ జోడో యాత్ర క్రమంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 కిలోమీటర్ల మేర కొనసాగిన భారత్ జోడో యాత్ర ఉదయం 10 గంటలకు బలిబోర్డా చౌరహాకు చేరుకుంది. భోజన విరామం అనంతరం తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు నహర్డి నుంచి యాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సాయంత్రం చంద్రభాగ చౌరహాలో కార్నర్ బహిరంగ సభ నిర్వహించారు. ఝలావర్లో రాత్రి బస చేసేందుకు యాత్ర నిలిచిపోయింది.
భారత్ జోడో యాత్రను కవర్ చేయని ప్రధాన మీడియా.. !
కాగా, ప్రధాన స్రవంతి మీడియా భారత్ జోడో యాత్రను కవర్ చేయడంలేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. అశోక్ గెహ్లాట్ సోమవారం ప్రధాన స్రవంతి జాతీయ మీడియాపై విమర్శలతో విరుచుకుపడ్డారు. సంపాదకులు, యజమానులు ఒత్తిడిలో ఉన్నందున వారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కవర్ చేయడం లేదని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోకి ప్రవేశించిన ఒక రోజు తర్వాత ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రసంగించిన గెహ్లాట్ , ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా తమ బాధ్యతను నెరవేర్చడంలో మీడియా పూర్తిగా విఫలమైందనీ, చరిత్ర క్షమించదని పేర్కొన్నారు.