పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇక లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ కు లడ్డూలు ఇచ్చేందుకు ఢిల్లీ ఎమ్మెల్యేలు ఆయనకు ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివృద్ధి మంత్రం పక్క రాష్ట్రంలో పంజాబ్ లో తీవ్ర ప్రభావం చూపింది. అధికారం కోసం ఇతర పార్టీలు కనీసం దరిదాపుల్లోకి రాకుండా ఆప్ స్పష్టమైన, అత్యధిక మెజారిటీని సాధించింది. ఢిల్లీలో మూడు సార్లు అధికారంలో చేపట్టిన ఆప్.. మొదటి సారి పక్క రాష్ట్రంలోనూ పాగా వేయనుంది. దీంతో రెండు రాష్ట్రాలనూ అతి స్వల్ప కాల వ్యవధిలో అధికారం చేపట్టబోతున్న పార్టీగా ఆప్ చరిత్ర సృష్టింనుంది.
పంజాబ్ లో అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్ కు లడ్డూలు అందించడానికి వెళ్లారు. కుమార్ విశ్వాస్ ఆప్ మాజీ నేత. ఆయన నివాసం ఘజియాబాద్ లో ఉంది. ఆప్ విజయం నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఆరడజను మంది ఎమ్మెల్యే బృందం మనోజ్ కుమార్ నేతృత్వంలో కుమార్ విశ్వాస్ ఇంటికి వెళ్లారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. సరిగ్గా పంజాబ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కుమార్ విశ్వాస్ అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ పంజాబ్ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక పంజాబ్ దేశానికి ఆయన ప్రధాని కావాలని అనుకుంటున్నారని, ఈ విషయం తనతో చెప్పారని విశ్వాస్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎన్నికలకు ముందు కుమార్ విశ్వాస్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో ‘‘ ఒక రోజు ఆయన (కేజ్రీవాల్) నాతో మాట్లాడుతూ తాను పంజాబ్కి సీఎం అవుతానని లేదా స్వతంత్ర పంజాబ్ దేశానికి మొదటి ప్రధాని అవుతానని చెప్పాడు. అతను ఎలాగైనా అధికారం కోరుకుంటున్నాడు.’’ అని మాట్లాడారు. అయితే ఈ ఆరోపణలను కేజ్రీవాల్ ఖండించారు. అవును తాను టెర్రరిస్ట్ నే అని, కానీ స్వీట్ టెర్రరిస్ట్ అని చెప్పారు. ప్రజల కోసం రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్ నిర్మించే స్వీట్ టెర్రరిస్ట్ ను అని తనని తాను అభివర్ణించుకున్నారు. అయితే కుమార్ విశ్వాస్ వ్యాఖ్యల అనంతరం ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకు ఆయనకు కేంద్ర హోం శాఖ ‘‘వై’’ కేటగిరి భద్రత కల్పించింది.
గతంలో కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు. అయితే పదవుల పంపకం విషయంలో అరవింద్ కేజ్రీవాల్ కు, ఆయనకు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఆయన ఆప్ కు రాజీనామా చేశారు. కానీ పలు సందర్భాల్లో కేజ్రీవాల్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగానే ఎన్నికలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ వేర్పాటువాదులతో చేతులు కలుపుతున్నారని, ఇలాంటివి దేశ భద్రతకు చాలా ప్రమాదకరమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు అమిత్ షా స్సందించారు. దేశ విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపితే ఎవరినీ ఊపేక్షించబోమని, కచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు.