Punjab Elections 2022: పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందనిముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీనే అధికారం చేప‌డుతుంద‌ని దీమా వ్య‌క్తం చేశారు  

Punjab Elections 2022: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లలో కీల‌క ఘ‌ట్టమైన పంజాబ్ ఎన్నిక‌ల పోలింగ్ నేడు  జ‌రుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభ‌మైంది. ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఆస‌క్తిక‌రంగా పోలింగ్ స్టేష‌న్లు త‌ర‌లివ‌స్తున్నారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌ బారులు తీరారు. పంజాబ్‌లోని  మొత్తం 117  అసెంబ్లీ స్థానాలున్నాయి. 1304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  దీంతో పంజాబ్‌లోని 2.14 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు.  

ఈ త‌రుణంలో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతతో గెలుస్తుందని, ఎన్నికల్లో కాంగ్రెస్ మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని దీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని చన్ని ఉద్ఘాటించారు. పంజాబ్‌ వ్యాప్తంగా బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌ అభ్యర్థులకు డేరా సచ్చా సౌదా మద్దతు పలుకుతుందని సంచలన చేశారు. ఈ పార్టీల నైరాశ్యాన్ని చూసినపుడు పంజాబ్‌లో కాంగ్రెస్ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టమవుతోందన్నారు.   

త‌మ ప్ర‌భుత్వం విద్యకు ప్రాధాన్య‌త ఇస్తుంద‌నీ, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తేనే.. పేదరికం నుంచి బయటప‌డుతార‌నీ, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్య అందిస్తామ‌ని తెలిపారు. రాష్ట్రంలో చాలా మంది తమ పిల్లలను చదివించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని చన్నీ చెప్పారు.  అందుకే నాణ్యమైన విద్యను ఉచితంగా అందజేస్తానని హామీ ఇచ్చాను. ఎస్సీ స్కాలర్‌షిప్‌ మాదిరిగానే బీసీ స్కాలర్‌షిప్‌, జనరల్‌ కేటగిరీలోని పేద విద్యార్థుల‌కు స్కాలర్‌షిప్‌ ఇస్తామని చెప్పారు.

ఈ తరుణంలో బీజేపీ-ఎస్ఏడీ భాగస్వామ్యం తీవ్రంగా మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు డేరా సచ్చా సౌదా నుంచి మద్దతు పొందు తున్నాయన్నారు. ఈ పార్టీలు జట్టు కట్టినప్పటికీ, పంజాబ్ ప్రజలు వాటికి వ్యతిరేకంగా ఏకమవుతున్నారని, ఓట్లతో గుణపాఠం చెబుతారని అన్నారు. అకాలీదళ్‌కు మద్దతుగా డేరా సచ్చా సౌదా బీజేపీతో కలిసి వస్తోందనీ, పంజాబ్ మొత్తంలో అకాలీదళ్‌కు మద్దతు ప్రకటించింది. త్యాగాల అంశం మళ్లీ తెరపైకి వచ్చిందని అన్నారు.
 
పంజాబ్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ 20 సీట్లకు మించి గెలవదని జోస్యం చెప్పారు. కేజ్రీవాల్ పార్టీ  దేశ ఐక్యత, సమగ్రతను పట్టించుకోలేదనీ,  ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఖలిస్తాన్‌ను సమర్థించే ప్రజల మద్దతును తీసుకుందని ఆరోపించారు. తాను చమ్‌కౌర్ సాహిబ్‌తో పాటు బదౌర్ నుండి పోటీ చేయ‌డానికి గ‌ల కారణాన్ని కూడా వివరించాడు. తాను పోటీ చేస్తున్న ఈ  నియోజ‌క‌వ‌ర్గంలో  కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. అయినా ఆ రెండు నియోజ‌క వ‌ర్గాల్లో గెలుస్తున్నాన‌ని దీమా వ్య‌క్తం చేశారు.

ఇదిలావుండగా, పంజాబ్ ఎన్నికల్లో పాటియాలా నియోజకవర్గం నుంచి తాను గెలిచి తీరుతానని మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ దీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక లోకంలో విహరిస్తోందని, ఆ పార్టీ పంజాబ్‌లో తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు. 

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. 117 స్థానాల్లో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా, శిరోమణి అకాలీదళ్ 18 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. మరోవైపు, ఆప్ 20 సీట్లతో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఫైన‌ల్ గా కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో అధికారం చేజిక్కించుకుంది.  

 2022 ఎన్నికలలో కాంగ్రెస్, AAP ఒంటరిగా పోటీ చేస్తుండ‌గా..  BJP తో కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది, సుఖ్‌దేవ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్), BSP లు కలిసి పోటీ చేస్తున్నాయి.

డేరా సచ్చా సౌదా బాబా రామ్ రహీమ్

హర్యానాలో సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా బాబా రామ్ రహీమ్, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌లు ఈ నెల తొలివారంలో  21 రోజుల పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చారు. బాబా ఇంతకు ముందు చాలాసార్లు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. కోర్టు అతని పెరోల్‌ను తిరస్కరించింది. అయితే , పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ పెరోల్ వెనుక రాజకీయ కోణం దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.