Punjab: పంజాబ్ నూత‌న‌ సీఎం భగవంత్ మాన్ కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. హోం శాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం భగవంత్.. హర్పాల్ చీమాకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పజెప్పారు 

Punjab: ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్)సంచ‌ల‌న విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ నూత‌న సీఎం భగవంత్ మాన్ గా నియ‌మితుల‌య్యారు. ఆయ‌న ప్రారంభం నుంచి జోరు మీద ఉన్నాడు. త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుంటు.. అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. తాజాగా త‌న‌ కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. 

ఇందులో ప్రధాన శాఖ అయిన హోం ను తన వద్దే పెట్టుకుని.. న్యాయవాది, పంజాబ్‌లో మాజీ ప్రతిపక్ష నాయకుడు హర్పాల్ చీమా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. గత రాష్ట్ర ఎన్నికల్లో ఆప్ టిక్కెట్‌పై గెలిచిన గుర్మీత్ సింగ్ కు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్ప‌జెప్పారు. AAP అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తుందని, రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాన్సా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, గాయకుడు సిద్ధూ మూసేవాలాపై 63,000 ఓట్ల తేడాతో గెలుపొందిన డాక్టర్ విజయ్ సింగ్లా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్య‌తలు అప్ప‌జెప్పారు. సింగ్లా డెంటల్ సర్జన్ కూడా.

అలాగే.. శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆప్ అధికార ప్రతినిధి హర్జోత్ బెయిన్స్‌కు న్యాయ మంత్రిత్వ శాఖ, పర్యాటక శాఖను కేటాయించారు. సామాజిక భద్రత, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను డాక్టర్ బల్జీత్ కౌర్‌కు అప్పగించారు. హర్భజన్ సింగ్‌కు విద్యుత్ శాఖను అప్పగించారు. లాల్ చంద్ ఫుడ్ అండ్ సప్లై డిపార్ట్‌మెంట్‌గా వ్యవహరిస్తుండగా, కుల్దీప్ సింగ్ ధలీవాల్ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించారు. పంజాబ్ నూత‌న‌ రవాణా మంత్రిగా లల్జిత్ సింగ్ భుల్లర్ , జల మంత్రిత్వ శాఖను బ్రాం శంకర్ కు బాధ్య‌తలు కట్టబెట్టారు.

ఇదిలా ఉంటే పంజాబ్ 16వ అసెంబ్లీ స్పీకర్గా ఆప్ ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సంధ్వాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం భగవంత్ మాన్ స్పీకర్గా ఆయన పేరు ప్రతిపాదించగా.. కేబినెట్ మినిస్టర్ హర్పాల్ చీమ బలపరిచారు. 46 ఏళ్ల కుల్తార్ సింగ్.. భారత మాజీ రాష్ట్రపతి జైల్ సింగ్‌ సోదరుడి మనవడు. 

మంత్రులు- ఎవరెవరికి ఏ శాఖ అంటే?

>> చరణ్‌జిత్ సింగ్ చన్నీ- హోం శాఖ‌
>> గుర్మీత్ సింగ్- విద్య శాఖ
>> డాక్టర్ విజయ్ సింగ్లా - ఆరోగ్యం శాఖ 
>> హరజోత్ సింగ్ బెయిన్స్ - న్యాయ, టూరిజం శాఖ
>> డాక్టర్ బల్జీత్ కౌర్- సోషల్ సెక్యూరిటీతో పాటు ఉమెన్, చైల్డ్ డెవలప్మెంట్, 
>> హర్భజన్ సింగ్ - విద్యుత్ శాఖ 
>> లాల్ చంద్- పుడ్ అండ్ సప్లై శాఖ 
>> కుల్దీప్ సింగ్ దలీవాల్ - రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ శాఖ 
>> లల్జిత్ సింగ్ భుల్లర్- రవాణా శాఖ
>> బ్రామ్ శంకర్ జింపా - జల మంత్రిత్వ శాఖ

ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ ఆమ్‌ ఆద్మీ పార్టీ 92 సీట్లు సాధించింది. దీంతో పంజాబ్ లో తొలిసారి కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ కాకుండా మరో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్ గ‌త శ‌నివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో పాటు మంత్రులుగా డాక్టర్ దల్జీత్ కౌర్, హర్పాల్ సింగ్ చీమా, హర్బజన్ సింగ్, లాల్ చంద్, డాక్టర్ విజయ్ సింగ్లా, గుర్మిత్ సింగ్, లాల్ జిత్ సింగ్ భుల్లార్, బ్రామ్ శంకర్ జింపా, కటారుచక్,హరజోత్ సింగ్ బెయిన్స్, కుల్దీప్ సింగ్ ధలివాల్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.