Punjab Assembly Election 2022 : మహిళలకు నెలకు రూ. 1000, ఫ్రీ కరెంట్.. పంజాబ్ లో ఆప్ మేనిఫెస్టో
పంజాబ్ లో మహిళలకు నెలకు రూ.1000, ఉచిత కరెంటు, ఉచిత విద్యా, వైద్యం అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు 10 పాయింట్లతో కూడిన మేనిఫెస్టోను ఢిల్లీ సీఎం, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విడుదల చేశారు.
పంజాబ్ (punjab) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తన మేనిఫెస్టో ప్రకటించింది. ఈ మేనిఫెస్టోను ‘పంజాబ్ మోడల్’ (punjab model) పేరుతో ఢిల్లీ సీఎం, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) బుధవారం విడుదల చేశారు. ఇందులో పంజాబ్ ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు పలు ఆకర్షణీయమైన పథకాలను పొందుపర్చారు. పది ముఖ్యమైన పాయింట్లతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు.
పంజాబ్ లోని మొహలీలో ఏర్పాటు చేసిన సభలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని మేనిఫెస్టోను విడుదల చేసి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో పంజాబ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధి కోసం కెనడా వెళ్లిన రాష్ట్ర యువతి తిరిగి పంజాబ్ కు వస్తారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని శాంతియుత పంజాబ్ గా మారుస్తానని వాగ్ధానం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని, వ్యాపార అనుకూల పాలన అందిస్తామని తెలిపారు.
తమ ప్రభుత్వం పంజాబ్లో అధికారంలోకి వస్తే రాష్ట్రం నుంచి మాదకద్రవ్యాల సిండికేట్ను పూర్తిగా తుడిచివేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అవినీతిని అంతం చేస్తామని అన్నారు. తాము 16,000 మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతీ పంజాబీకి 24 గంటలు ఉచితంగా వైద్య సదుపాయాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తామని అన్నారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు నెలకు రూ.1000 ఇస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ఫ్లై ఓవర్ పై నిలిచిపోయిన ఘటన నేపథ్యంలో చంఢీగఢ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ప్రధానమంత్రి భద్రతా ఉల్లంఘన తీవ్రమైన అంశమని అన్నారు. ప్రధానితో పాటు సామాన్య ప్రజలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం ప్రధానమంత్రితో పాటు సామాన్యులకు అవసరమైన భద్రత కల్పిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం పంజాబ్లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్నఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరిస్తోంది. గతంలో ఆప్ సంయుక్త సమాజ్ మోర్చాతో (samyukta samaj morcha) కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది. అయితే అలా పోటీ చేస్తే తమ ఓట్ల శాతంపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించి ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది.
117 శాసన సభ స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీకి వచ్చే నెల 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో 77 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ నిలిచింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసింది. అందులో భాగంగా పంజాబ్ లోనూ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే రెండో విడతలో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 21వ తేదీన పంజాబ్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 28వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి, 30వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. మిగిలిన అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు అంటే మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.