భార్యకు సెలైన్ ద్వారా హెచ్ఐవీ ఎక్కించిన భర్త
భార్యను వదిలించుకోవడానికి ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెకు ఏకంగా హెచ్ఐవీ వైరస్ ఎక్కించాడు.
భార్యను వదిలించుకోవడానికి ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెకు ఏకంగా హెచ్ఐవీ వైరస్ ఎక్కించాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పూణెకి చెందిన మహిళకు 2015లో వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ.. భర్త, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు.
గతేడాది ఆమెకు అనారోగ్యం పాడైన సమయంలో సెలైన్ ద్వారా హెచ్ఐవీ వైరస్ సోకిన వ్యక్తి రక్తం ఎక్కించాడు. ఇప్పుడు తనకు హెచ్ఐవీ ఉందని విడాకులు ఇవ్వమని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
‘‘ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధితురాలు మళ్లీ అనారోగ్యం బారిన పడ్డప్పుడు పరీక్షలు చేయగా అమెకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు మొదటిసారిగా తెలిసింది. అదే సమయంలో భర్తకూ పరీక్ష చేస్తే నెగటివ్ అని తేలింది. తర్వాత ఇటీవల మళ్లీ మేము భార్యాభర్తలిద్దరికీ ఓ ప్రైవేటు ల్యాబ్లో పరీక్ష చేయించగా.. ఇద్దరికీ హెచ్ఐవీ వైరస్ సోకినట్లు తేలింది. అంతకుముందు వారు ప్రభుత్వాసుపత్రిలో పరీక్ష చేయించుకున్నప్పుడు కేవలం భార్యకు మాత్రమే వైరస్ సోకినట్లు వెల్లడైంది.’’ అని పోలీసులు వెల్లడించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై వరకట్న వేధింపులు, విషప్రయోగం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.