కేరళ సీఎం పినరయి విజయన్ కు విమానంలో నిరసన సెగ..
కేరళ ముఖ్యమంత్రికి చేదు అనుభవం ఎదురయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.
కేరళ : కేరళ ముఖ్యమంత్రి Pinarayi Vijayanకు విమాన ప్రయాణంలో ఊహించని సంఘటన ఎదురయ్యింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సీఎం దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్.. వారిని వెనక్కి నెట్టేశారు.
ఆ వీడియోలు social mediaల్లో చక్కర్లు కొడుతున్నాయి. కేరళలోని కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్లే విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్ సీఎం విజయన్ మీద ఆరోపణలు చేశారు. ఆ నేపథ్యంలో విపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టాయి.
ఇదిలా ఉండగా, జూన్ 8న కేరళలో గతంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం తాజాగా.. మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. గతేడాది కేరళ శాసనసభ ఎన్నికల సమయంలో.. ఈ వివాదం కేరళ రాజకీయాలు తీవ్ర ప్రకంపనలను సృష్టించింది. అయితే తాజాగా బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. ఇలా బాధపెట్టే కంటే.. చంపేయండి.. : మీడియా ముందు స్వప్న సురేష్ కన్నీరు..
కేరళ సీఎం పినరయి విజయన్ కారణంగానే తాను గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నట్లు స్వప్న సురేష్ వెల్లడించారు. ఈ కేసుతో కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన భార్య కమలా విజయన్, కూతురు వీణా విజయన్,రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నళిని నెట్టో, సీఎం అదనపు వ్యక్తిగత కార్యదర్శి సీఎం రవీంద్రన్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీ జలీల్ లకు సంబంధముందని ఆమె ఆరోపించింది. ఆమె జూన్ 7న ఎర్నాకుళంలోని కోర్టుకు ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించింది.
కాగా.. స్వప్న సురేష్ చేసిన ఆరోపణలపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. స్వప్న సురేష్ ఆరోపణలను తోసిపుచ్చారు. అవి నిరాధారమైనవనీ, రాజకీయ ప్రేరేపితమైనవి అని పేర్కొన్నారు. నిందితులు ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసే ఆర్థిక నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
బంగారం స్మగ్లింగ్ కుంభకోణంపై సమన్వయంతో, సమర్ధవంతంగా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మొదట కోరిందనీ, దర్యాప్తు పద్ధతుల గురించి తదుపరి చట్టబద్ధమైన ఆందోళనలు సకాలంలో సూచించబడ్డాయని సిఎం విజయన్ తెలిపారు.
కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు ఏంటి???
కేరళ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. 5, జులై 2020న తిరువనంతపురం విమానాశ్రయమంలో రూ.15కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ నుంచి డిప్లొమాటిక్ పాస్ పోర్టుపై వచ్చిన సరిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాగులో ఇది దొరికింది. దీంతో సరితను అదుపులోకి తీసుకున్నారు. చివరికి అసలు నిజం చెప్పడంతో ఈ గోల్ట్ స్మగ్లింగ్ సెన్సేషనల్ క్రైమ్ బయటపడింది. దీంతో ఈ కేసులో కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజర్ గా పనిచేస్తున్న స్వప్న సురేష్, మాజీ కాన్సులేట్ ఉద్యోగి, సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్లను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో స్వప్న సురేష్ అరెస్టయిన 16 నెలల తర్వాత నవంబర్ 2021లో జైలు నుండి విడుదలైంది.