మామయ్య రాహుల్పై ప్రశంసలు.. తొలి ఫోటో ఎగ్జిబిషన్పై ప్రియాంక గాంధీ కుమారుడి స్పందన
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా దంపతుల తనయుడు రైహాన్ రాజీవ్ వాద్రా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా తన మొదటి ఫోటో ఎగ్జిబిషన్ను ‘‘డార్క్ పర్సెప్షన్’’ పేరుతో ప్రారంభించారు. 2017లో పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో తన కంటికి గాయమైన సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలతో రైహాన్ ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. కాంతి, స్థలం, సమయం అనేవి ప్రపంచం గురించి మన అవగాహన యొక్క మూడు నిర్ణాయకాలు. చీకటిగా వున్నప్పుడు ఏం జరుగుతుంది అంటూ రైహాన్ ట్వీట్ చేశాడు.
తన కంటికి ప్రమాదం తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్లు చేయడం ప్రారంభించానని ఆయన చెప్పారు. చీకటి అనే భావన వల్ల కాంతిని వెతుకుతామని రైహన్ తెలిపారు. రైహన్ బాల్య అభిరుచిని ప్రియాంక గాంధీ ఎంతగానో ప్రొత్సహించారు. మరోవైపు అతని తాత, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి కూడా ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. రాజీవ్ రచనలను రైహాన్ అధ్యయనం చేస్తున్నాడు. అప్పటి, ఇప్పటి డీఎస్ఎల్ఆర్ వాడకం.. తాతగారి రచనలు ఆసక్తికరంగా వున్నాయని చెప్పాడు. తన తల్లే తనకు విమర్శకురాలినని.. అంతేకాకుండా ఈ ఎగ్జిబిషన్ పెట్టేలా ప్రొత్సహించిన మామయ్య రాహుల్ గాంధీ తనను నడిపిస్తూ వుంటారని రైహాన్ వెల్లడించారు. వైల్డ్లైఫ్ షూట్స్తో పాటు లండన్లో తాను చదువుకున్న వరకు సేకరించిన ఫోటోలను ప్రదర్శనకు ఉంచాడు. తన ఎగ్జిబిషన్ను చూడటానికి అతని అమ్మమ్మ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రావడం గర్వించదగ్గ క్షణమని తెలిపాడు.
ఈ ఎగ్జిబిషన్పై రైహాన్ను అభినందిస్తూ అతని తల్లి ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. తన కొడుకు సొంత మార్గాన్ని కనుగొని , లక్ష్యాల కోసం కృషి చేస్తున్నందుకు గర్వంగా వుందన్నారు. అతని తొలి ప్రదర్శన 'Dark Perception: An Exposition of Light, Space and Time', ప్రస్తుతం న్యూఢిల్లీలోని బికనీర్ హౌస్లో జరుగుతోందని చెబుతూ.. రైహాన్తో దిగిన ఫోటోను ప్రియాంక ట్వీట్ చేశారు. జూలై 11న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్... ఈ నెల 17 వరకు జరుగుతుంది.