ఎవరైనా డోంట్ కేర్ : మోడీ సోదరుడి కుమార్తెపై చైన్ స్నాచర్ల ప్రతాపం
యువతులు, మహిళలనే లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్న ఈ చైన్ స్నాచర్లకు స్వయానా ప్రధాని సొంత సోదరుడి కుమార్తె బాధితురాలయ్యింది. దీనితో ఇప్పుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ: కావేవీ దొంగతనానికి అనర్హం అన్నట్టుగా మేమెవరిని వదిలిపెట్టం అన్న రీతిలో దొంగలు రెచ్చిపోతున్నారు. అందరు దొంగలందు చైన్ స్నాచర్ల రూటు వేరయా అన్నట్టుగా వారు మరింత మితిమీరి ప్రవర్తిస్తున్నారు. వారి ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోయింది.
యువతులు, మహిళలనే లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్న ఈ చైన్ స్నాచర్లకు స్వయానా ప్రధాని సొంత సోదరుడి కుమార్తె బాధితురాలయ్యింది. దీనితో ఇప్పుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బాధితురాలు దమయంతి బెన్ మోడీ కథనం ప్రకారం, శనివారం ఉదయం అమ్రిత్సర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు దమయంతి. బస కోసం సివిల్ లైన్స్ ప్రాంతంలోని లో గుజరాతీ సమాజ్ భవన్ లో రూమ్ బుక్ చేసుకున్నారు.
గేటు వద్దకు వచేసరకు ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు తన హ్యాండ్ బ్యాగును లాక్కెళ్లినట్టు ఆమె తెలిపారు. ఆ బ్యాగులో దాదాపు 56వేల నగదు, రెండు సెల్ ఫోన్లు ముఖ్యమైన పత్రాలు ఉన్నట్టు ఆమె సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
శనివారం సాయంత్రమే వేరే ఫ్లైట్ ఉన్నా, ముఖ్యమైన పత్రాలన్నీ ఆ బ్యాగులోనే ఉండడంతో తాను ప్రయాణం చేయలేకపోతున్నానని ఆమె వాపోయారు. హై ప్రొఫైల్ కేసు అవడం, అందునా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.