రోడ్డు ప్రమాదానికి గురైన ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ.. హాస్పిటల్ కు తరలింపు..
ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులందరికీ స్వల్పగాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూరులో శివార్లలో ఉన్న కడ్కోళ్ల ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ప్రహ్లాద్ మోడీకి పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
ఈ ఘటన మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రహ్లాద్ మోడీ మైసూరు నుంచి తన వాహనంలో చామరాజనగర్, బందీపూర్ కు ప్రయాణిస్తున్నారని నివేదికలు తెలిపాయి. వాహనం ప్రమాదానికి గురైన సమయంలో ఆయనతో పాటు మరో ఐదుగురు కూడా ఉన్నారు. ఇందులో ఉన్న వారందరికీ గాయాలు అయ్యాయి. దీంతో వారిని జేఎస్ఎస్ ఆస్పత్రిలో చేర్పించారు.
క్షతగాత్రులందరికీ ప్రథమ చికిత్స అందించి, ఇతర వైద్య పరీక్షలన్నీ చేశారు. ఈ ఘటనలో ప్రహ్లాద్ మోడీ మనవడి తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. కారులో ఉన్న ఐదుగురిని ప్రహ్లాద్ మోడీ, ఆయన కుమారుడు మెహుల్ మోడీ, కోడలు, మనవడు మేనత్ మెహుల్ మోడీ, వారి డ్రైవర్ సత్యనారాయణగా గుర్తించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...