New Delhi: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలు లేఖ రాశారు. ప్రతిపక్ష సభ్యులను టార్గెట్ చేస్తూ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే సమయంలో సీబీఐ సిసోడియాను చిత్రహింసలకు గురిచేస్తున్నదని ఆప్ ఆరోపించింది.
AAP national spokesperson Saurabh Bhardwaj: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాను సీబీఐ చిత్రహింసలు పెడుతోందనీ, తప్పుడు ఆరోపణలతో కూడిన పత్రాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెస్తోందని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తుకు సహకరించకపోవడం, దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు తప్పించుకోవడం వంటి ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ సిసోడియాను ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. సిసోడియా కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు మార్చి 6 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని మంత్రివర్గానికి సిసోడియా రాజీనామా చేశారు.
ఎక్సైజ్ విధానంపై నిపుణుల కమిటీ సిఫార్సులపై న్యాయపరమైన అభిప్రాయాలతో కూడిన కీలకమైన మిస్సింగ్ ఫైల్ ను కనుగొనడానికి సిసోడియా కస్టడీని ఉపయోగించుకోవాలని ఏజెన్సీ భావిస్తోందనీ, ఇది ఇప్పటికీ ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. అయితే, మనీష్ సిసోడియాను సీబీఐ చిత్రహింసలకు గురి చేస్తోందని, తనపై మోపిన తప్పుడు అభియోగాలతో కూడిన పత్రాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెస్తోందని ఆప్ నాయకుడు భరద్వాజ్ ఆరోపించారు. సిసోడియాకు వ్యతిరేకంగా సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ ఇదివరకు పేర్కొందనీ, ఆయన ఇంటిపై దాడి చేసినా ఏమీ దొరకలేదని తెలిపిందని భరద్వాజ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఐదు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో శనివారం కోర్టులో హాజరుపరిచిన సిసోడియా తాను ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు కూర్చొని అవే ప్రశ్నలకు పదేపదే సమాధానాలు చెబుతున్నాననీ, ఇది మానసిక వేధింపుగా పేర్కొన్నారు. నిందితులపై థర్డ్ డిగ్రీని ప్రయోగించవద్దని గత విచారణలో సీబీఐని ఆదేశించిన న్యాయమూర్తి అవే ప్రశ్నలను పదేపదే అడగొద్దని దర్యాప్తు సంస్థకు సూచించారు. 'మీకేదైనా కొత్త అంశాలు ఉంటే అడగండి' అని న్యాయమూర్తి అన్నారు.
ఇదిలావుండగా, ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలు లేఖ రాశారు. ప్రతిపక్ష సభ్యులను టార్గెట్ చేస్తూ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నేతలు సీఎం కే చంద్రశేఖర్ రావు, మమతా బెనర్జీ, భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్లు ఈ లేఖ పై సంతకాలు పెట్టారు.
