Indian Army Day 2022: మీ త్యాగాలు మరువలేనివి.... ఆర్మీడేపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
Indian Army Day 2022: జాతీయ సైనిక దినోత్సవాన్ని (జనవరి 15) పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలను మాటల్లో వర్ణించలేమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు.
Indian Army Day 2022: భారతదేశ చరిత్రలో జనవరి 15కు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్లో బ్రిటీష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కోదండెర ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి భారత్ జనవరి 15ని 'ఆర్మీ డే'గా జరుపుకుంటోంది. సైనికుల త్యాగాలు, దేశ రక్షణలో సైనికుల పాత్ర, వారి త్యాగాలను గుర్తుచేస్తూ.. భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ సంవత్సరం 'ఆర్మీ డే' వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ సైనిక దినోత్సవాన్ని (Indian Army Day 2022) (జనవరి 15) పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలను మాటల్లో వర్ణించలేమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు.
దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలను మాటల్లో వర్ణించలేమనీ, వారి త్యాగాలు మరువలేనివని అన్నారు. దేశ రక్షణలో వారి సేవలు ఎంతో కీలకమని గుర్తుచేశారు. సోషల్ మీడియా వేదికగా సైనిక దినోత్సవ (Indian Army Day 2022) సందేశాన్ని పంపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. సైనికుల సేవలను కొనియాడారు. ‘సైనిక దినోత్సవం సందర్భంగా ఆర్మీ సిబ్బంది, సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. దేశ భద్రతకు భరోసా ఇవ్వడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. దేశ సరిహద్దుల వెంట శాంతి భద్రతలను కాపాడడంలో మన సైనికులు ఎంతో నైపుణ్యం, శౌర్యం ప్రదర్శిస్తున్నారు. వారి సేవలు వెలకట్టలేనివి. ఇందుకుగాను యావత్ దేశం ధన్యవాదాలు చెబుతోంది. జై హింద్!’ అని ట్విట్టర్ వేదికగా సైనిక దినోత్సవ సందేశం అందించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
అలాగే, ప్రధాని మోడీ సైతం భారత సైన్యంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆర్మీ డే సందర్భంగా.. మన ధైర్యవంతులైన సైనికులు, మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. భారత సైన్యం ధైర్యసాహసాలు, వృత్తి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. దేశ భద్రత కోసం భారత సైన్యం చేస్తున్న అమూల్యమైన సహకారం గురించి చెప్పడానికి మాటలు న్యాయం చేయలేవు’ అని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మరో ట్వీట్లో.. ‘భారత ఆర్మీ సిబ్బంది ప్రతికూల పరిస్థితులలో, భూభాగాలలో దేశానికి సేవలందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో సహా మానవతా సంక్షోభ సమయంలో తోటి పౌరులకు సహాయం చేయడంలో ముందంజలో ఉన్నారు. మన సైనికులు విదేశాలలో శాంతి కార్యకలాపాలలో ఎల్లప్పుడూ చురుకుగా పాల్గొంటారు. భారత సైన్యం యొక్క గొప్ప సహకారానికి భారతదేశం గర్విస్తోంది’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత సైన్యం సేవలను కొనియాడారు. ‘ దేశాన్ని రక్షించడంలో మన సైనికుల నిబద్ధత తిరుగులేనిది. సైన్యాన్ని చూసి యావత్ దేశం గర్విస్తోంది’ అని ఆయన ట్వీట్ చేశారు.