కుమార్తెలు దేశానికి ఆశాకిరణాలు .. అవకాశాలు అందించాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. మన కుమార్తెలు దేశానికి ఆశాకిరణాలన్న ద్రౌపది ముర్ము... భారత్ వైవిధ్యంతో నిండి వుందన్నారు
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని (75th independence day) పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (draupadi murmu) జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ అమర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. కరోనా కష్టకాలాన్ని అధిగమించామని, స్టార్టప్లు దూసుకెళ్తున్నాయని రాష్ట్రపతి అన్నారు. కరోనా తర్వాత భారత ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందోని.. ఇప్పటికీ అనేక దేశాలు ఆర్ధిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్నాయని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
దేశ విభజన సందర్భంగా ఆగస్ట్ 14న స్మృతి దివస్ జరుపుకుంటున్నామని.. 2021 మార్చి నుంచి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నామని ఆమె అన్నారు. కరోనా సమయంలో ప్రపంచమంతా ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. క్లిష్ట సమయాన్ని సమర్ధంగా ఎదుర్కొని ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచామని ద్రౌపది అన్నారు. ఆర్ధిక వ్యవస్థలో డిజిటల్ విధానం పెను మార్పులు తెచ్చిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామన్న ఆమె... వ్యాక్సినేషన్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
Also Read:పంద్రాగస్టున జాతీయ జెండా ఎగరేస్తాం.. మాకు రక్షణ ఇవ్వండి: ప్రధానికి ఐఎస్ఎఫ్ ఎమ్మెల్యే విజ్ఞప్తి
మన కుమార్తెలు దేశానికి ఆశాకిరణాలన్న ద్రౌపది ముర్ము... భారత్ వైవిధ్యంతో నిండి వుందన్నారు. మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం వుంటుందని.. అదే మనల్ని ఏకతాటిపైకి తీసుకొస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇవాళ దేశంలోని పంచాయతీరాజ్ సంస్థల్లో ఎన్నికైన మహిళా ప్రతినిధుల సంఖ్య పధ్నాలుగు లక్షలకు పైనే అని ఆమె గుర్తుచేశారు. వారికి సరైన అవకాశాలు కల్పిస్తే గొప్ప విజయాలు సాధించగలరని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.