సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వీరమణ: రాష్ట్రపతి ఉత్తర్వులు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుత చీఫ్ జస్టిస్ బాబ్డే పదవీ విరమణ తర్వాత 48వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ నెల 23వ తేదీన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే రిటైర్ కానున్నారు. ఈ నెల 24న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీరమణ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా 2022 ఆగష్టు 26వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.2014 ఫిబ్రవరి 17 న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందుగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పనిచేశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్ఏ బోబ్డే 2019 నవంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు.రంజన్ గోగోయ్ తర్వాత బోబ్డే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు.సాధారణ వ్యవసాయ కుటుంబంలో రమణ జన్మించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగారు. కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగష్టు 27న జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు.1983 ఫిబ్రవరి 10న ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టారు.
2000 జూన్ 27న లో ఏపీ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు ఆయన పదోన్నతిపై వెళ్లారు.