పార్టీలకు షాక్.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పనిచేయను: ప్రశాంత్ కిశోర్
దేశంలోని పార్టీల అధినేతలకు షాకింగ్ న్యూస్.. ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త, అనలిస్ట్ ప్రశాంత్ కిశోర్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పనిచేయబోనని ప్రకటించారు
దేశంలోని పార్టీల అధినేతలకు షాకింగ్ న్యూస్.. ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త, అనలిస్ట్ ప్రశాంత్ కిశోర్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పనిచేయబోనని ప్రకటించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీ లీడర్షిప్ సమ్మిట్లో భాగంగా తొలిసారి ప్రజల ముందుకు వచ్చిన ఆయన... ‘‘2019 ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొనదలచుకోలేదు.
గత ఐదేళ్ల నుంచి చూస్తున్న రూపంలో తాను ప్రచారం చేయబోను అని స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా తాను అనేక మంది ప్రముఖ నాయకులతో కలిసి పనిచేశానని... ఇకపై తాను తొలిసారి పనిచేసిన గుజరాత్ లేదా నా సొంత రాష్ట్రం బీహార్కు కాని వెళతానని ప్రశాంత్ తెలిపారు. 2014లో నాటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు.
దీంతో పీకే పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. ఈ విజయంతో బిహార్లో తమ తరపున పనిచేసి పెట్టాలని మహాకూటమి నేతలు పీకేను కోరారు. దీనికి సమ్మతించిన ఆయన నితీశ్ కుమార్ సారథ్యంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో క్రీయశీలకంగా వ్యవహరించారు. వరుస విజయాలతో ఊపు మీదున్న ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించారు.
ఏపీ వ్యాప్తంగా సర్వే చేసిన పీకే టీమ్ వైసీపీ ఎక్కడ బలంగా ఉంది.. నేతల పనితీరు ఎలా ఉంది అన్న దానిపై నివేదిక ఇచ్చారు. ప్రశాంత్ సూచన మేరకే జగన్ పాదయాత్ర చేపట్టారని వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ని విజయాలున్నా.. పరాజయాలు కూడా ప్రశాంత్ ఖాతాలో ఉన్నాయి. గతేడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఛరిష్మా ముందు పీకే ఆటలు సాగలేదు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది.