ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? ఆయన సమాధానమేంటీ?
రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని తోసిపుచ్చారు. అయితే తన సొంత రాష్ట్రమైన బీహార్లో మెరుగైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జన్ సూరజ్ అనే పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు 500 కి.మీ ప్రయాణం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన రాజకీయ భవిష్యత్తు గురించి, జేడీయూ ఆరోపణలపై బహిరంగంగా మాట్లాడారు.అలాగే..తన 42 రోజుల ప్రయాణంలో తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
జేడీయూ ఆరోపణలకు సమాధానం
బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా.. తాను ఎన్నికల్లో పోటీ చేయను అని స్పష్టం చేశారు. తనకు అలాంటి ఆశయం లేదని అన్నారు. అయితే తన సొంత రాష్ట్రమైన బీహార్ లో మంచి ప్రత్యామ్నాయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తనని రాజకీయ చతురత లేని వ్యాపారవేత్త అన్న జేడీయూ ఆరోపణలను తోసిపుచ్చారు. రాజకీయాలపై అంతగా అవగాహన లేని తనను నితీష్ కుమార్ రెండేళ్లుగా తన ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారని ప్రశ్నించారు.
పశ్చిమ చంపారన్లో ఆదివారం జరగనున్న జిల్లా మహాసభల గురించి ఆయన మాట్లాడుతూ జన్ సురాజ్ ప్రచారాన్ని రాజకీయ పార్టీగా చేయాలా వద్దా అనే అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు. రాష్ట్రంలోని 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఉన్న ప్రశాంత్ కిషోర్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి ప్రజాపోరాటాలు జరుగుతాయని, దాని ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు.
నేడు నితీష్కి ఆ ధైర్యం లేదు
గతంలో నితీశ్కుమార్తో కలిసి పనిచేసినందుకు పశ్చాత్తాపం లేదన్నారు. అయితే, జేడీయూ దాడులతో ఆయన బాధపడ్డారు. నితీష్ పదేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు లేరని అన్నారు. 2014లో పార్టీ ఓటమి తర్వాత అధికారాన్ని వదులుకున్న నితీష్ కుమార్ ఇప్పుడు అలా లేడనీ, అధికారంలో ఉండేందుకు ఎలాంటి రాజీకైనా దిగే వాడు నేటి నితీష్ కుమార్ అనీ, ఆయన నేడు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోగలడని అన్నారు. అలాగే.. ఏడాదిలోపు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న మహాకూటమి ప్రభుత్వం హామీని తుంగలో తొక్కిందనీ, ఇంతకుముందు చాలాసార్లు ఇలాంటి ప్రకటనలు చేశారని విమర్శించారు.