స్వామియే శరణం అయ్యప్ప.. శబరిమలను చుట్టేసిన పాలిటిక్స్
Sabarimala: శబరిమలలో దర్శనానికి వచ్చిన ఒక చిన్నారి తన తండ్రి కనిపించకపోవడంతో ఏడుస్తున్న వీడియో, ఫొటోలను మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని కేరళ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేసిన వారిపై చర్యలకు ఆదేశించింది.
![Politics wrapped around Sabarimala, Massive Protests In Kerala, police crack down child video RMA Politics wrapped around Sabarimala, Massive Protests In Kerala, police crack down child video RMA](https://static-ai.asianetnews.com/images/01hhfep2gasqkvc6fx3k2c434a/Screenshot-2023-12-12-211917-1702399511050_363x203xt.png)
Sabarimala - politics: పవిత్ర పుణ్యక్షేత్రం, అయ్యప్ప స్వామి కొలువుదీరిన శబరిమల చుట్టే ఇప్పుడు కేరళ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం శబరిమల మాలలు ధరించి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం కోసం వస్తుండటంతో ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఒక చిన్నారి తన తండ్రికోసం ఒక వాహనంలో ఏడుస్తూ.. చేతులు జోడించి వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభుత్వం ఇలా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులను సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు కలుగజేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష ఆరోపణలను ఖండిస్తోంది. కావాలనే తప్పుడు ఆరోపణలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతోంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్నారి దృశ్యాల ప్రచారమంటూ..
శబరిమలలో దర్శనానికి వచ్చిన తన తండ్రి కనిపించకపోవడంతో వేరే రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి ఏడుస్తున్న వీడియో, ఫొటోను మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారనీ, దీనిపై కేసు నమోదు చేయాలని ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జిల్లాల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసిన వారి సమాచారాన్ని సేకరించి సైబర్ విభాగానికి అందజేయాలని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సైబర్ సెల్ కూడా విడివిడిగా సమాచారాన్ని సేకరిస్తోంది.
పోస్ట్ చేసిన వారి వివరాలను సోషల్ మీడియా సంస్థల నుంచి సేకరిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోస్టులను తొలగించాలని సోషల్ మీడియా కంపెనీలను కోరనున్నట్లు సైబర్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసిన 50 మందికి పైగా వ్యక్తులను గుర్తించారు. తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన వారి వివరాలను కూడా ప్రజలు సైబర్ సెల్ కు తెలియజేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరిని గుర్తించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది ఆ పోస్టులను డిలీట్ చేశారు.
మరో కొత్త పోస్టర్ రచ్చ..
శబరిమలలో భక్తులు ఇబ్బందులను ప్రస్తావిస్తూ ధర్నాలో భాగంగా పాలక్కాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పేరుతో డిజిటల్ పోస్టర్ విడుదల చేయడం వివాదాస్పదమైంది. శబరిమల దర్శనానికి వచ్చిన ఓ చిన్నారి ఏడుస్తున్న దృశ్యాలు ఈ పోస్టర్లో ఉన్నాయి. తండ్రిని చూడలేదని ఆ చిన్నారి ఏడ్చిందనీ, అయితే పోస్టర్ పై చిన్నారి ఫొటోను పెట్టి భక్తులు ఆపదలో ఉన్నారనే భావన కలిగించే ప్రయత్నం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. కాగా, పోస్టర్ తయారీతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.