ఒకరికి తెలీకుండా మరొకరు.. నాలుగు పెళ్లిళ్ల తర్వాత..
భర్త ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు రావడంతో.. సుమతికి అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే భర్త ఫోన్ చెక్ చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అతను ఓ నిత్య పెళ్లి కొడుకు. నిండా 30ఏళ్లు కూడా లేవు.. కానీ అమ్మాయిలను మోసం చేయడంలో ఆరితేరాడు. ఒకరికి తెలీకుండా మరోకరిని వలలో వేసుకోవడంలో సిద్ధహస్తుడు. ఇప్పటి వరకు నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. నాలుగో భార్య కూడా గర్భం దాల్చడంతో... అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో.. అతని నాలుగు పెళ్లిళ్ల వ్యవహారం బయటపడింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి సమీపం తిరువెరుంబుయూర్ బాలాజీనగర్ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ మహాలింగం కుమారుడు కార్తీక్(26) ప్రైవేటు సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కాగా.. కార్తీక్ కి తేని జిల్లా ఉతమపాళయం ప్రాంతానికి చెందిన సుమతి(20) తో గతేడాది వివాహం జరిగింది. కాగా.. ఇటీవల సుమతి గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా.. సుమతి బంగారం మొత్తం కుదవ పెట్టి డబ్బులు జల్సా చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి.
భర్త ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు రావడంతో.. సుమతికి అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే భర్త ఫోన్ చెక్ చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమతి అతని సెల్ఫోన్ పరిశీలించగా, పలువురు మహిళలతో కార్తీక్ కలసి తీయించుకున్న ఫొటోలు కనిపించాయి. ఈ విషయమై సుమతి విచారించగా, కొద్ది కాలం కిత్రం కార్తీక్ తల్లిదండ్రుల అంగీకారంతో తిరుచ్చికి చెందిన స్టెల్లా అనే యువతిని వివాహం చేసుకున్నాడు.
అనంతరం చెన్నైకి చెందిన వాణి అనే యువతిని రెండవ వివాహం చేసుకోగా, అదే ప్రాంతానికి చెందిన మీనాను మూడవ వివాహం జరిగి తనతో నాలుగో వివాహమని సుమతి తెలుసుకుంది. ఇక స్టెల్లాకు 3 ఏళ్ల కుమారుడు, రెండో భార్య మీనాకు ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉన్నట్లు కూడా తెలిసింది. దీంతో సుమతి లాల్గుడి పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేయడంతో, ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, కార్తీక్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.