హత్య చేసి.. ఫేస్ బుక్ లో పోలీసులకు సవాల్ విసిరి...
అతనిని.. దల్జీత్ సింగ్ షేర్ గ్యాంగ్ కి చెందిన షేరా అనే వ్యక్తి చంపినట్లు పోలీసులకు దర్యాప్తులో తేలింది. దీంతో.. నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు.
పంజాబ్ లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి... అక్కడ పోలీసులను తప్పించుకొని ఓ ఘరానా నేరస్థుడు హైదరాబాద్ కి మకాం మార్చాడు. తాను హత్య చేసిన విషయాన్ని బాహాటంగా సోషల్ మీడియాలో షేర్ చేసి పోలీసులకు సవాల్ విసిరాడు. కాగా.. తాజాగా ఆ నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాబ్ లోని కపుర్తలా జిల్లా బెగోవాల్ పట్టణంలో ఇటీవల ముఖుల్ అనే ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. అతనిని.. దల్జీత్ సింగ్ షేర్ గ్యాంగ్ కి చెందిన షేరా అనే వ్యక్తి చంపినట్లు పోలీసులకు దర్యాప్తులో తేలింది. దీంతో.. నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు.
నిందితుడు పోలీసులకు చిక్కకుండా.. హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1900 కిలో మీటర్లకు పైగా సంచరించాడు. అయితే.. ముఖుల్ ని హత్య చేసింది తానేనంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. తాను ఇలాంటి హత్యలు మరిన్ని చేయనున్నానంటూ వార్నింగ్ చేశాడు. దీంతో.. ఈ కేసును సవాలుగా చేసుకున్న పోలీసులు నిందితుడిని హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అరెస్టు చేశారు.
కాగా.. షేరా హైదరాబాద్ లో ఓ సెక్యూరిటీ గార్డ్ ఇంట్లో తలదాచుకున్నాడు. అక్కడ ఇటీవల ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు. ఆ క్రమంలో తుపాకీ చూపించి బెదిరించాడు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో.. అక్కడకు వచ్చి షేరా ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే.. అతను పంజాబ్ లో గత నెల జరిగిన హత్య కేసులో నిందితుడని తేలింది. అలా పోలీసులకు ఛిక్కాడు.