పేదలు సైతం చౌకగా, చక్కటి వైద్యాన్ని పొందినప్పుడు వ్యవస్థపై వారికి నమ్మకం కలుగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్‌లోని భుజ్ జిల్లాలో ఏర్పాటు చేసిన కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మోడీ ప్రారంభించారు.  

దేశంలో వచ్చే పదేళ్ల కాలంలో భారీగా వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తారని ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గుజరాత్‌లోని (gujarat) భుజ్ జిల్లాలో (bhuj district) ఏర్పాటు చేసిన కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ (kk patel hospital bhuj) ఆస్పత్రిని ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ చర్యల ఫలితంగా రానున్న పదేళ్లలో భారీగా వైద్యులు సమకూరతారని మోడీ తెలిపారు. అందుబాటు ధరలకే నాణ్యమైన వైద్యాన్ని భుజ్ ఆస్పత్రి అందించాలని ప్రధాని సూచించారు. 

20 ఏళ్ల కిందట గుజరాత్‌లో 9 వైద్య కళాశాలలే ఉన్నాయని... వాటిలోని సీట్లు 1,100 అని గుర్తుచేశారు. నేడు 36 కళాశాలలు, 6,000 సీట్లకు పెరిగాయి అని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. 2001లో తీవ్ర భూకంపాన్ని తట్టుకుని నిలబడినట్టు ఆయన గుర్తు చేశారు. వ్యాధులకే కాదని, సామాజిక న్యాయానికీ చికిత్స అవసరమని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పేదలు సైతం చౌకగా, చక్కటి వైద్యాన్ని పొందినప్పుడు వ్యవస్థపై వారికి నమ్మకం కలుగుతుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే.. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ప్రధాని నరేంద్ర మోడీ ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను ప్రారంభించారు. భారత్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి సేవలందించిన ప్రధాన మంత్రుల గురించిన వివరాలను ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. ఈ ప్రధాన మంత్రులు దేశ ఉన్నతికి చేపట్టిన విధానాలు, అవలంభించిన మార్గాలు, వారి కృషిని వెల్లడిస్తుంది. ఈ సందర్భంగా తానే స్వయంగా తొలి టికెట్ కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

స్వాతంత్ర్యం పొందిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు మన దేశం ఎదుర్కొన్న సవాళ్లను మన దేశ ప్రధానమంత్రులు అధిగమించిన వివరాలను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. వారి ప్రయాణాలను వివరించడంతోపాటు దేశ చరిత్రలోని కీలక ఘట్టాలనూ ఈ సంగ్రహాలయం ఆవిష్కరించనుంది. ఎలాంటి వివక్ష లేకుండా ప్రధానమంత్రులు అందరి సేవలను గుర్తించి ప్రదర్శనకు ఉంచనున్నట్టు అధికారులు వెల్లడించారు. వారి భావజాలాలకు, పదవీకాలాలకు అతీతంగా అందరి కృషిని ప్రజల ముందు ఉంచనున్నట్టు తెలిపారు.