Asianet News TeluguAsianet News Telugu

నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ … ఇద్దరిలో ఎవరు రిచ్?

భారత రాజకీయాల్లో ప్రస్తుతం మోదీ వర్సెస్ గాంధీ ల మధ్యే పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి. 

PM Narendra Modi and Congress Leader Rahul Gandhi Assets details  AKP
Author
First Published May 15, 2024, 8:26 AM IST

ఒకాయన గత పదేళ్లుగా భారత ప్రధాని. ఇంకొకాయన ప్రధాని పదవికోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.   ఇద్దరూ జాతీయ పార్టీలకు చెందినవారే... దేశ రాజకీయాలను శాసించేవారే. అడుగు బయటపెడితే చాలు విమానాలు, హెలికాప్టర్లు, భారీ కాన్వాయ్ తో ప్రయాణిస్తుంటారు. కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ ఇద్దరి నేతల వద్ద సొంత ఇళ్లు కారు కూడా లేవట. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఉత్తర ప్రదేశ్ నుండి పోటీచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నామినేషన్స్ దాఖలు చేసారు. దీంతో వారి ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. 

నరేంద్ర మోదీ : 

గత పదేళ్లుగా భారత ప్రధానిగాకొనసాగుతున్నారు నరేంద్ర మోదీ. ఈసారి కూడా ఎన్డియే ప్రధాని అభ్యర్థి ఆయనే. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని మోదీ అధిరోహిస్తారని... హ్యాట్రిక్ విజయం ఖాయమని బిజెపి శ్రేణులు ధీమాతో వున్నాయి. ఎలక్షన్ మూడ్ కూడా అలాగే వుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

అయితే ప్రతిసారిలాగే ఈసారి కూడా మోదీ అత్యధిక లోక్ సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ నుండి బరిలోకి దిగుతున్నారు. వారణాసి లోక్ సభ కు పోటీచేస్తున్న ఆయన నిన్న(మంగళవారం) నామినేషన్ దాఖలు చేసారు. ఈ క్రమంలోనే తన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. 

గుజరాత్ ముఖ్యమంత్రి నాలుగుసార్లు. దేశ ప్రధానిగా రెండుసార్లు పనిచేసారు మోదీ. ఇలా సుదీర్ఘకాలం అత్యున్నత పదవుల్లో కొనసాగిన ఆయన ఆస్తులెన్నో తెలుసా..? కేవలం 3.02 కోట్లు.  ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటూ ప్రధాని వద్ద సొంత ఇళ్ళుగాని, కారుగానీ లేదట.

తన ఆస్తుల్లో ఎక్కువభాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఫిక్సుడ్ డఫాజిట్ల రూపంలో వున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇలా రూ.2.86 కోట్లు వున్నాయట. ఇక తన స్వస్థలం గాంధీనగర్, ప్రస్తుతం పోటీచేస్తున్న వారణాసిలో మోదీకి బ్యాంక్ అకౌంట్స వున్నాయట... వాటిలో రూ.80,304 డిపాజిట్స్ వున్నట్లు తెలిపారు. ఇక తనవద్ద రూ.52,920 నగదు, రూ.2.68 లక్షల విలువైన  నాలుగు బంగారు ఉంగరాలు వున్నట్లు మోదీ వెల్లడించారు. 

అయితే ఈ ఐదేళ్లలో మోదీ ఆదాయం రెట్టింపయ్యింది. గత లోక్ సభ ఎన్నికల (2019) సమయంలో ప్రధాని మోదీ ఆదాయం ఏడాదికి రూ.11 లక్షలుగా వుంటే గతేడాది అంటే 2022-23 లో ఆయన ఆదాయం రూ.23.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ప్రధాని మోదీ ప్రకటించారు. 

రాహుల్ గాంధీ : 

ఇక మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల మనవడు, రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ కూడా ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలి నుండి పోటీచేస్తున్నారు. ప్రతిపక్ష ఇండి కూటమి ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటున్న ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసారు. దీంతో ఆయన ఆస్తుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ప్రధాని మోదీ మాదిరిగానే రాహుల్ కూడా సొంత ఇళ్లు, కారు లేవని ప్రకటించారు. 

రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆయనకు రూ. 9.24 కోట్ల చరాస్తులు, రూ. 11. 14 కోట్ల సిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు 20 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.3,81,33,572 విలువైన షేర్లు, రూ.26,25,157 బ్యాంక్ బ్యాలెన్స్, రూ.15,21,740 బాండ్లు సహా రూ.9,24,59,264 చరాస్తులు ఉండగా.., రూ.11,15,02,598 ల స్థిరాస్తులు ఉన్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. 
 
తన ఆస్తులలో రూ.9,04,89,000 విలువైన స్వీయ ఆర్జిత ఆస్తులు ఉండగా.. రూ.2,10,13,598 విలువైన వారసత్వ ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే.. తన వద్ద రూ.55,000 నగదు ఉందని, రూ.49,79,184 అప్పులు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రాహుల్ గాంధీ వార్షిక ఆదాయం దాదాపు కోటీ రూపాయాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే న్యూ ఢిల్లీలోని సుల్తాన్‌పూర్, మెహ్రౌలీ గ్రామంలోని వ్యవసాయ భూమి, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిపి ఉమ్మడిగా కలిగి ఉన్న సుమారు 3  ఎకరాలు.. గురుగ్రామ్‌లోని సిగ్నేచర్ టవర్స్‌లో 5,838 చదరపు అడుగుల విస్తీర్ణంలో కామర్షియల్ అపార్ట్‌మెంట్లు, వాటి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 9.05 కోట్లుగా ఉన్నట్టు ప్రకటించారు. 

రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుండి ఎంఫిల్ పట్టా పొందారు. ఆయన ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేశారు. తనపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన పరువు నష్టం కేసులు, అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌తో సంబంధం ఉన్న 18 కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios