ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి వణుకు పుడుతున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.  

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికి చెందిన ఈ ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు సంధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి వణుకు అని అన్నారు. అందుకే పట్టుబట్టి మరీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించారని ఆరోపణలు చేశారు. కానీ, అరెస్టు తర్వాత కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా అంటే.. బీజేపీ ఎదుర్కోలేని స్థాయికి చేరుతున్నారని వివరించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత మరింత పదునుదేలుతున్నారని సంజయ్ రౌత్ అన్నారు. ఆయన జైలు నుంచే పని చేయడం మొదలు పెట్టారని, తొలి ఆదేశం వెలువడిందనీ వివరించారు. ఢిల్లీ ప్రజలు ఆయన వెంటే ఉంటూ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో కూడా పోరాడి జైలుకు వెళ్లిన నాయకులు మరింత బలోపేతమయ్యారని చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి, ఆప్ కలిసి ర్యాలీ నిర్వహించనున్నాయి. ఈ ర్యాలీలో ఇతర నాయకులతో కలిసి తాను కూడా పాల్గొంటానని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.