జమ్మూ కాశ్మీర్ అఖిలపక్షనేతలతో మోడీ భేటీ: కీలకాంశాలపై చర్చ
జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు పార్టీల నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు పార్టీల నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశానికి నేషనల్ కాన్పరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పీడీఎఫ్ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోనే, ముజఫర్ హుస్సేన్ బేగ్, అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుల్కారీ సహా 14 మంది నేతలు న్యూఢిల్లీలోని మోడీ నివాసంలో సమావేశానికి హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేత గులాం అహ్మద్ మీర్ మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ నివాసంలో సమావేశమయ్యారు. స్టేట్ హూడ్ అంశాన్ని ఈ సమావేశంలో లేవనెత్తుతామని గులాం అహ్మద్ మీర్ తెలిపారు.జమ్మూ, కాశ్మీర్ లకు ప్రత్యేక హోదాను తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం 2019లో నిర్ణయం తీసుకొంది. జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించింది.జమ్మూ కాశ్మీర్ లో డిలీమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తైతే జమ్మూ, కాశ్మీర్ లలో ఎన్నికలు నిర్వహించే అంశంపై కేంద్రీకరించనుంది కేంద్రం.