ధైర్యం, సంయమనం, సానుకూల శక్తిని తీసుకురావాలంటూ ప్రధాని మోడీ దసరా శుభాకాంక్షలు
Dussehra 2022: ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
Dussehra 2022: దేశ ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం విజయదశమి సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు ధైర్యం, సంయమనం, సానుకూల శక్తి లభించాలని కోరుతూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బిలాస్పూర్లో ఎయిమ్స్ను ప్రారంభించనున్న ప్రధాని, హిమాచల్ ప్రదేశ్లోని కులు దసరా వేడుకలకు కూడా హాజరుకానున్నారు. “విజయానికి ప్రతీక అయిన విజయదశమి సందర్భంగా దేశప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ధైర్యం, సంయమనం, సానుకూల శక్తిని తీసుకురావాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. "విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ అనైతికతపై విధాన విజయానికి, అసత్యంపై సత్యం, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ దేశప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను" అని ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.
జమ్మూ కాశ్మీర్లో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, “ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తిని, స్ఫూర్తిని నింపాలి” అని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 'భారత్ జోడో యాత్ర'కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. “విద్వేష లంకను తగలబెట్టండి, హింస మేఘనాద్ను తుడిచివేయండి. రావణుడి అహాన్ని అంతం చేయండి. సత్యం, న్యాయం గెలవాలి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, శశి థరూర్, అశోక్ గెహ్లాట్ సహా పలువురు దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశాన్ని రక్షించే సాయుధ దళాల ఆయుధాలను పూజించే మతపరమైన, ప్రతీకాత్మకమైన 'శాస్త్ర పూజన్ సమాహ్రోహ్'లో పాల్గొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.