రెండు రోజుల గుజరాత్ పర్యటనకు ప్రధాని మోడీ.. రూ.29 వేల కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం
Gujarat: సూరత్ , భావ్ నగ ర్, అహ్మదాబాద్, అంబాజీలలో సుమారు రూ.29,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ఆయన ఈ నెల 29, 30 తేదీల్లో గుజరాత్ లో పర్యటించనున్నారు.
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 29, 30 తేదీల్లో గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మొత్తం 29 వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు ప్రధాని సూరత్ లో రూ.3400 కోట్ల కు పైగా విలువ చేసే వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి.. జాతికి అంకితం చేయనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తరువాత ప్రధాని భావ్ నగర్ లో పర్య టిస్తారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రూ.5200 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, ప్రారంభిస్తారు. అలాగే, రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తారు. రాత్రి 9 గంటలకు అహ్మదాబాద్ లోని జీఎండీసీ మైదానంలో జరిగే నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఆ తర్వాతి రోజు..సెప్టెంబరు 30న ఉదయం 10:30 గంటలకు గాంధీనగర్ స్టేషన్లో గాంధీనగర్-ముంబయి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించడంతో పాటు అక్కడి నుండి కలుపూర్ రైల్వే స్టేషన్కు రైలులో ప్రయాణిస్తారు. ఉదయం 11:30 గంటలకు, అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే, కలుపూర్ స్టేషన్ నుండి దూరదర్శన్ కేంద్ర మెట్రో స్టేషన్ వరకు మెట్రో ప్రయాణం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు, అహ్మదాబాద్లోని అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీలో జరిగే బహిరంగ కార్యక్రమంలో అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్-1ని ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత, సాయంత్రం 5:45 గంటలకు, అంబాజీలో రూ. 7200 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రాత్రి 7 గంటలకు అంబాజీ ఆలయంలో ప్రధాని దర్శనం, ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత రాత్రి 7:45 గంటలకు గబ్బర్ తీర్థంలో జరిగే మహా ఆరతికి హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సూరత్ లో ప్రధాని మోడీ 3400 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో నీటి సరఫరా, డ్రైనేజీ ప్రాజెక్టులు, డ్రీమ్ సిటీ, బయోడైవర్సిటీ పార్కు, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెరిటేజ్ పునరుద్ధరణ, సిటీ బస్/ బీఆర్టిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అభివృద్ధి కార్యక్రమాల వంటి ఇతర అభివృద్ధి పనులు ఉన్నాయి.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఏర్పాటు చేసే గ్రాండ్ ప్రారంభ కార్యక్రమంలో 36వ జాతీయ క్రీడలను ప్రధాని ప్రారంభిస్తారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే దేశ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా, దేశార్లో ప్రపంచ స్థాయి “స్వర్ణిమ్ గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ”ని కూడా ప్రారంభిస్తారు. గుజరాత్ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. ఇది 29 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 12 వరకు జరగనున్నాయి.