అండమాన్ దీవులకు 21 మంది పరమ వీర చక్ర అవార్డ్ గ్రహీతల పేర్లు.. 23న మోడీ చేతులమీదుగా
భారతదేశంలోని అత్యున్నత సైనిక పురస్కారం పరమ వీర చక్ర అవార్డ్ అందుకున్న 21 మంది వీరులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గౌరవం కల్పించనుంది. జనవరి 23వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది.
పరాక్రమ్ దివాస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 23వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 21 మంది పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు అండమాన్ అండ్ నికోబార్ దీవులలోని 21 దీవులకు పెట్టనున్నారు. ఇదే కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేషనల్ మెమోరియల్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల చారిత్రాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో వుంచుకుని ..2018లో ఈ ప్రాంతంలో పర్యటించారు ప్రధాని. అనంతరం నేతాజీ జ్ఞాపకార్ధం రాస్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టారు. నీల్ ఐలాండ్, హేవ్లాక్ దీవికి షాహీద్ ద్వీప్ .. స్వరాజ్ ద్వీప్ అని పేరు పెట్టారు.
దేశంలోని రియల్ హీరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ప్రధాన మంత్రి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ స్పూర్తిలో భాగంగానే అండమాన్ ద్వీపాల సముదాయంలోని 21 పెద్ద దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇది దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు త్యాగం చేసిన మన వీరులకు శాశ్వత నివాళి అవుతుంది.
21 మంది పరమ వీర చక్ర అవార్డ్ గ్రహీతలు వీరే:
1. మేజర్ సోమనాథ్ శర్మ
2. జాడ్నాథ్ సింగ్
3. రామ రాఘోభా రాణే
4. పిరు సింగ్
5. కరమ్ సింగ్
6. గురుబచ్చన్ సింగ్ సలారియా
7. ధాన్ సింగ్ తాప
8. జోగిందర్ సింగ్
9. సైతాన్ సింగ్
10. అబ్ధుల్ హామీద్
11. అర్దేషిర్ తారాపోర్
12. అల్బెర్ట్ ఎక్కా
13. నిర్మల్ జిత్ సింగ్ సేఖాన్
14. అరుణ్ ఖేతర్పాల్
15. హోషియర్ సింగ్ దాహియా
16. బాణా సింగ్
17. రామస్వామి పరమేశ్వరన్
18. మనోజ్ కుమార్ పాండే
19. యోగింద్ర సింగ్ యాదవ్
20. సంజయ్ కుమార్
21. విక్రమ్ బాత్రా