నేడు వీర్ బాల్ దివస్.. చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ..
సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు జొరావర్ సింగ్, ఫతేహ్ సింగ్ వీరమరణం పొందిన డిసెంబర్ 26వ తేదీని ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా వీర్బాల్ దివస్గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు జొరావర్ సింగ్, ఫతేహ్ సింగ్ వీరమరణం పొందిన డిసెంబర్ 26వ తేదీని ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా వీర్బాల్ దివస్గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ గుర్తుగా జరిగే చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి దాదాపు మూడు వందల మంది బాల కీర్తనలు ప్రదర్శించే ‘షాబాద్ కీర్తన’కు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఢిల్లీలో దాదాపు మూడు వేల మంది చిన్నారులతో మార్చ్ పాస్ట్ను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
సాహిబ్జాదేల ఆదర్శప్రాయమైన ధైర్యసాహసాల గురించి పౌరులకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో వ్యాస రచన, క్విజ్ పోటీలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించబడతాయి. రైల్వే స్టేషన్లు, పెట్రోల్ పంపులు, విమానాశ్రయాలు మొదలైన బహిరంగ ప్రదేశాలలో డిజిటల్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయబడతాయి. దేశవ్యాప్తంగా ప్రముఖులు సాహిబ్జాదేల జీవిత చరిత్ర, త్యాగం గురించి వివరించే కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 9న వీర్ బాల్ దివస్ గురించి ప్రధాని మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదే బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ జీల బలిదానానికి గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 26న ‘‘వీర్ బాల్ దివస్’’ జరుపబడుతుందని ప్రధాన మంత్రి మోదీ ప్రకటించారు.