అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!
భారత్లో 5 జీ సేవలు ప్రారంభానికి డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 1వ తేదీన ప్రగతి మైదాన్లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 5జీ సేవలను ప్రారంభించనున్నారు.
భారత్లో 5 జీ సేవలు ప్రారంభానికి డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 1వ తేదీన ప్రగతి మైదాన్లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 5జీ సేవలను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ ఒక ట్వీట్లో.. ‘‘భారతదేశం డిజిటల్ పరివర్తన, కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకువెళుతూ.. ఆసియాలో అతిపెద్దది టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా ప్రధాని మోదీ భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నారు’’ అని పేర్కొంది.
ఇక, తక్కువ వ్యవధిలో దేశంలో 5G టెలికాం సేవలను 80 శాతం కవరేజీని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గత వారం తెలిపారు.
ఇక, వారం రోజుల పాటు 5జీ స్పెక్ట్రం వేలం కొనసాగిన సంగతి తెలిసిందే. 5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం టెలికాం ఆపరేటర్ల నుంచి రూ 1.5 లక్షల కోట్ల విలువైన బిడ్స్ వచ్చాయి. ఇందులో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్వర్క్స్ పాల్గొన్నాయి. మొత్తం 72,098 మెగా హెట్జ్ స్పెక్ట్రమ్ వేలం వేయగా.. 51,236 మెగా హెట్జ్ (71 శాతం) విక్రయించబడిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాబోయే రెండు మూడేండ్లలో దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ చేరువవుతుందని అన్నారు. 5జీ అందుబాటు ధరలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.