టోక్యో ఒలింపిక్స్: జూలై 13న భారత అథ్లెట్లతో ప్రధాని మోడీ ఇంటరాక్షన్
టోక్యో ఒలింపిక్స్కు బయల్దేరనున్న అథ్లెట్ల బృందంతో జూలై 13న సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. ఒలింపిక్స్లో పాల్గొనడానికి ముందు ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు
టోక్యో ఒలింపిక్స్కు బయల్దేరనున్న అథ్లెట్ల బృందంతో జూలై 13న సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. ఒలింపిక్స్లో పాల్గొనడానికి ముందు ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. టోక్కో 2020లో పాల్గొనబోయే బృందానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా సన్నాహాలను ప్రధాని ఇటీవల సమీక్షించారు. మన్ కీ బాత్లోనూ అథ్లెట్ల స్పూర్తిదాయకమైన ప్రయాణాల గురించి ఆయన చర్చించారు. అలాగే క్రీడాకారులకు మద్ధతుగా దేశం మద్ధతుగా నిలవాలని ప్రధాని దేశ ప్రజలను కోరారు.
Also Read:ఒలింపిక్స్కి వెళ్లాక పాజిటివ్గా తేలితే అంతే... మార్గదర్శకాలు విడుదల చేసిన ఐఓసీ...
ఒలింపింక్స్ అథ్లెట్లతో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిసిత్ ప్రమానిక్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొంటారు. భారతదేశం నుంచి 18 క్రీడా విభాగాలలో మొత్తం 126 మంది అథ్లెట్లు టోక్యోకు బయల్దేరి వెళతారు. ఇప్పటి వరకు జరిగిన ఏ ఒలింపిక్స్లోనైనా భారత్ నుంచి వెళుతున్న అతిపెద్ద అథ్లెట్ల బృందం ఇదే. అలాగే 18 క్రీడా విభాగాలలో 69 ఈవెంట్లలో భారత అథ్లెట్లు పాల్గొననుండటం కూడా ఇదే ప్రథమం. తొలిసారిగా భారతదేశానికి చెందిన ఫెన్సర్ భవానీ దేవీ ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించారు. అలాగే నేత్రా కుమనన్ ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించిన తొలి మహిళా నావికురాలు. స్విమ్మింగ్లో ‘‘ఎ’’ క్వాలిఫికేషన్ స్టాండర్డ్ సాధించడం ద్వారా ఒలింపిక్ క్రీడలకు భారత్ నుంచి సజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజ్ అర్హత సాధించారు.