ప్రధాని మోడీ దసరా వేడుకలు ఎక్కడ జరుపుకుంటున్నారంటే?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు హిమాచల్ ప్రదేశ్ వెళ్లుతున్నారు. ధాల్పుర్ గ్రౌండ్ కుల్లుకు వెళ్లుతారు. అక్కడే ఆయన కుల్లు దసరా సంబురాల్లో పాల్గొంటారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పండుగ వేడుకల్లో పాల్గొనడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. రేపే దేశమంతటా దసరా వేడుకలు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ దసరానే వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో వేర్వేరు పద్ధతుల్లో జరుపుకుంటూ ఉంటారు. ఈ సారి భారత ప్రధాని నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్లో ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని ధాల్పూర్ గ్రౌండ్ కుల్లు పర్యటించనున్నారు. ఇంటర్నేషనల్ కుల్లు దసరా వేడుకల్లో ఆయన పాల్గొంటారు. 300 మందికి పైగా భక్తులతో సాగే విశిష్ట రథయాత్రను ఆయన తిలకిస్తారు. కుల్లు దసరా వేడుకల్లో పాల్గొన్న తొలి భారత ప్రధాని.. నరేంద్ర మోడీనే కావడం గమనార్హం.
భారత పండుగల్లో ప్రధాని మోడీ ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొన్ని రోజుల క్రితమే ఆయన గుజరాత్ పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నది. అయినప్పటికీ గత నెల 29వ తేదీన అహ్మదాబాద్లోని డీఎండీసీ గ్రౌండ్లో నిర్వహించిన నవరాత్రి ఫెస్టివల్లో పాల్గొన్నారు.
ఈ ఏడాది ఆగస్టులో గణేష్ చతుర్థి వేడుకలకు ఆయన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇంటికి వెళ్లారు. అక్కడే గణేషుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అదే విధంగా ఈ ఏడాది రక్షా బంధన్లో భాగంగా ఆయన కార్యక్రమంలో పని చేస్తున్న సిబ్బంది కూతుర్లతో రాఖీ కట్టించుకున్నారు.
ఏప్రిల్ 2022లో బిహు వేడుకల్లో భాగంగా కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఇంటికి వెళ్లారు. ఇదే ఏడాది ఏప్రిల్లో ప్రకాశ్ పురబ్ వేడుకల్లో పాల్గొన్నారు. రెడ్ ఫోర్ట్ సమీపంలో గురు తేజ్ బహదూర్ కోసం నిర్వహించే 400వ ప్రకాశ్ పురబ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరిలో రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.