‘‘ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్’’ ఆలోచనను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ
కేంద్ర బడ్జెట్ సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
కేంద్ర బడ్జెట్ సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు వెలుపల ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈరోజు రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు. ఇది మహిళలను గౌరవించే అవకాశం అని అన్నారు. సుదూర అడవులలో నివసించే మన గొప్ప గిరిజన సంప్రదాయాన్ని గౌరవించే అవకాశం కూడా అని చెప్పారు. మన ఆర్థిక మంత్రి కూడా మహిళే అని.. రేపు ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారని తెలిపారు.
నేటి ప్రపంచ పరిస్థితులలో మన దేశం మాత్రమే, ప్రపంచం మొత్తం భారతదేశ బడ్జెట్ వైపు చూస్తోందని చెప్పారు. భారతదేశ బడ్జెట్ సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. భారతదేశం, ప్రపంచ సమాజంలోని ప్రజల అంచనాలను అందుకోవడానికి సీతారామన్ పూర్తి ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
‘‘ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్’’అనే ఆలోచనతో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. విపక్ష నేతలు తమ అభిప్రాయాలను పార్లమెంటు ముందు తెలియజేస్తారని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023-24 ..
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతిగా పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము చేస్తున్న తొలి ప్రసంగం ఇది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24ను లోక్సభల ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ రెండు విడుతల్లో జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల మొదటి విడత ఫిబ్రవరి 14న ముగుస్తుంది. రెండో విడతలో భాగంగా మార్చి 12న పార్లమెంటు తిరిగి సమావేశమవుతుంది. అప్పటి నుంచి ఏప్రిల్ 6 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.