PM Modi: ఢిల్లీలోని ద్వారకలో  జరిగిన దసరా వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా భారతదేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంతకీ ఆ ప్రతిజ్ఞలేంటీ..?

PM Modi: భారతదేశం మునుపటి కంటే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ సూచించారు. కులతత్వం, ప్రాంతీయవాదం పేరుతో భారతమాతను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అభివృద్దికి బదులు స్వార్థం దాగి ఉన్న ఆ ఆలోచనను ఇది దహనం చేయాలని అన్నారు. కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు కుల గణనను డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇది సమాజాన్ని విభజించే ప్రయత్నమని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. విపక్షాల వైపు చూపిస్తూ.. ఈ వ్యక్తులు సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈ రావణుని దహనం కేవలం దిష్టిబొమ్మను దహనం చేయడం కాకూడదని, సమాజంలో పరస్పర సామరస్యం దెబ్బతిసే ప్రతి వైకల్యాన్ని దహనం చేయాలని అన్నారు.

ఈ రోజు మనం అదృష్టవంతులమని, రాముని ఆలయాన్ని నిర్మించడాన్ని మనం చూడగలుగుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే రామనవమి నాడు అయోధ్యలోని రాంలాలా ఆలయంలో ప్రతిధ్వనించే ప్రతి ఔటు యావత్ ప్రపంచానికి ఆనందాన్ని కలిగిస్తుందనీ, రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని అన్నారు.

విజయదశమి పండుగ రావణుడిపై రాముడి విజయోత్సవం మాత్రమే కాదనీ, దేశంలోని ప్రతి చెడుపై దేశభక్తి సాధించిన పండుగగా కూడా ఉండాలని ఆయన అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అత్యంత విశ్వసనీయ ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతోందన్నారు. చంద్రుడిపై విజయం సాధించి రెండు నెలలు పూర్తయిన సందర్భంగా ఈసారి విజయదశమిని జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

మన దేశంలో విజయదశమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం ఉందనీ, మన దేశ ఆయుధాలు ఏ భూమిపై ఆధిపత్యం కోసం కాదనీ, ఆత్మ రక్షణ కోసం వాడుతామని అన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ 10 ప్రతిజ్ఞలు బూనాలని ఆయన పిలుపునిచ్చారు. 

పది ప్రతిజ్ఞలివే..

1. రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపు చేయడం.

2. డిజిటల్ లావాదేవీలు చేసేలా ప్రజలను ప్రేరేపించడం.

3. గ్రామాలు, నగరాల్లో పరిశుభ్రత పట్ల నిబద్ధత కలిగి ఉండటం.

4. స్థానికంగా ఉత్పత్తి అయ్యే వస్తువులకు (vocal for local) ప్రాధాన్యత ఇవ్వడం.

5. పనిలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం. 

6. ముందుగా మన దేశంలో పర్యటించడం. ఆ తరువాతే విదేశాలకు వెళ్లడం.

7. సహజ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించడం.

8. దైనందిన జీవితంలో సూపర్‌ఫుడ్ మిల్లెట్‌లను చేర్చడం. 

9. యోగా, క్రీడలు, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం.

10. ఒక్కొక్కరూ కనీసం ఒక పేద కుటుంబాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయడం.