పీయూష్ గోయల్ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలకు ప్రధాని మోదీ.. గణేషుడికి హారతి.. వీడియో..
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇంటికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇంటికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొన్నారు. తన నివాసానికి వచ్చిన ప్రధాని మోదీకి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడున్నవారికి అభివాదం చేస్తూ ప్రధాని మోదీ.. గణేష్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. గణేషుడికి హారతి ఇచ్చిన మోదీ.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో షేర్ చేశారు.
‘‘గణేష్ చతుర్థి శుభ సందర్భంగా.. పీయూష్ గోయల్ నివాసంలో కార్యక్రమానికి వెళ్ళాను. భగవాన్ శ్రీ గణేష్ ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసం గణేషుడికి హారతి ఇస్తున్న వీడియోను పీయూష్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు.
ఇక, గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. దయ, సోదరభావం ఎల్లప్పుడూ వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సంస్కృత శ్లోకాన్ని షేర్ చేశారు. ‘‘గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. భగవంతుడు శ్రీ గణేష్ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండనివ్వండి’’ అని మోదీ పేర్కొన్నారు.