కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ దూసుకుపోతున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శనివారం బెంగళూరులో మెగా రోడ్ షో చేపట్టారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ దూసుకుపోతున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శనివారం బెంగళూరులో మెగా రోడ్ షో చేపట్టారు. మొత్తంగా 26 కి.మీ మేర ప్రధాని మోదీ రోడ్ షో సాగనుంది. ప్రధాని మోదీ రోడ్ షోకు ప్రజల నుంచి విశేషణ స్పందన లభిస్తుంది. దారి పొడుగున బీజేపీ శ్రేణులు, ప్రజలు ప్రధాని మోదీపై పూల వర్షం కురిపిస్తున్నారు. మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో బెంగళూరు నగరంలో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు.
బెంగళూరు సౌత్లోని సోమేశ్వర్ భవన్ ఆర్బీఐ గ్రౌండ్ నుంచి మల్లేశ్వరంలోని సాంకీ ట్యాంక్ వరకు రోడ్షో కొనసాగనుంది. దాదాపు మూడున్నర గంటల్లో రోడ్ షో పూర్తి అవుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ రోడ్ షో.. దక్షిణ, మధ్య బెంగళూరులోని కొన్ని ప్రాంతాల గుండా వెళుతుందని, 12 అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేస్తుందని బీజేపీ నేతలు చెప్పారు. ఇక, ప్రధాని వెంట బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ ఆదివారం తిప్పసంద్ర వద్ద కెంపేగౌడ విగ్రహం మధ్య నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్ షో చేపట్టనున్నారు.
మెగా రోడ్ షో నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. బెంగళూరు, బీజేపీ మధ్య పాత, బలమైన బంధం ఉందని చెప్పారు. బీజేపీకి తొలినాళ్ల నుంచి బెంగళూరు నగరం మద్దతిస్తూనే ఉందని పేర్కొన్నారు. బెంగళూరు అభివృద్దికి తాము అనేక ప్రయత్నాలు కూడా చేశామని తెలిపారు.
‘‘మేము మా ట్రాక్ రికార్డ్తో పాటు ఇప్పటివరకు సాధించిన విజయాలను మరింత పెంచుకుంటామని వాగ్దానం చేస్తున్నాం. ఈ వాగ్దానం ఆధారంగా బెంగళూరు ప్రజల దీవెనలు కోరుతున్నాము. కర్ణాటకను నంబర్ 1 రాష్ట్రంగా మార్చడంతోపాటు బెంగళూరు అభివృద్ధి పథంలో అసమానమైన ఊపును అందించడం మా ప్రయత్నం. హెల్త్కేర్, హౌసింగ్, పారిశుధ్యం.. ఇలా ప్రతిదానిలో బెంగళూరులో గణనీయమైన మార్పు వచ్చింది. ఇది చాలా మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దారితీసింది’’ అని మోదీ పేర్కొన్నారు.
