మరోసారి మోడీ Vs స్టాలిన్! వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన.. రాష్ట్రాలకు నిధులివ్వాలన్న స్టాలిన్
తమిళనాడులో మరోసారి ప్రధాని మోడీ వర్సెస్ సీఎం స్టాలిన్ అన్నట్టుగా సాగింది. తమిళనాడులో రూ. 5 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ రాష్ట్రాలకు నిధులు అందించాలని, రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న తెలంగాణ నుంచి తమిళనాడుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ రూ. 5 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. కానీ, తమిళనాడులో మాత్రం సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని పర్యటనలో ఆయన వెంట ఉండటమే కాదు.. కేంద్ర ప్రభుత్వానికీ ప్రశ్నలు వేశారు. ప్రధాని మోడీ రూ. 5 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రాలకు ఫండ్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను, చేసిన పనులను ప్రధాని మోడీ ఏకరువు పెట్టారు.
కాగా, సీఎం స్టాలిన్ నేరుగా ప్రధాని మోడీకి విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రావాలని అన్నారు. అలాగైతే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని వివరించారు. రైల్వే ప్రాజెక్టుల కోసం నిధులు పెంచాలని ప్రధాని మోడీకి రిక్వెస్ట్ చేశారు.
చెన్నై-మదురవోయల్ ఎక్స్ప్రెస్వే, చెన్నై తాంబరం ఎలివేటెడ్ కారిడార్, నాలుగు దారుల ఈస్ట్ కోస్ట్ రోడ్, చెన్నై-కాంచీపురం - వెల్లూరు హైవే, చెన్నై-మదురై సిక్స్ లేన్ జాతీయ రహదారుల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. ఈ రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేసేలా ప్రధానమంత్రి ఎన్హెచ్ఏఐని ఆదేశించాలని తెలిపారు. సంపన్న, శక్తివంతమైన రాష్ట్రాలే సమన్వయ సమాఖ్య స్ఫూర్తికి, వైబ్రంట్ ఇండియాకు సంకేతాలు అని అన్నారు.
Also Read: మహిళ సహా 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. హల్ద్వానీ జైలులో పరిస్థితి ఇదీ
గతంలోనూ ప్రధాని మోడీ, సీఎం ఎంకే స్టాలిన్ల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు స్టేజీ మీదనే ముఖాముఖిగా చేసుకున్నారు.