గణతంత్ర వేడుకలు.. ఈ ఏడాది మోదీ తలపాగా చాలా ప్రత్యేకం..!
ఆ తలపాగను ప్రధాని మోదీకి జామ్ నగర్ రాజ కుటుంబం బహుమతిగా ఇచ్చింది. ఈ రాజకుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గౌరవం ఉంది.
దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మంగళవారం ఉదయం ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలను పలకరిస్తూ అభినందనలు తెలిపారు.
ప్రతిసారీ గణతంత్ర వేడుకలు, స్వాతంత్ర దినోత్సవాల్లో ప్రధాని మోదీ తలకు తలపాగా ధరిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో సైతం ఆయన ఓ తలపాగా ధరించారు. అయితే.. ఆ తలపాగా మాత్రం చాలా ప్రత్యేకం. దానికో ప్రత్యేకత ఉంది.
ఆ తలపాగను ప్రధాని మోదీకి జామ్ నగర్ రాజ కుటుంబం బహుమతిగా ఇచ్చింది. ఈ రాజకుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గౌరవం ఉంది.
జామ్ నగర్ మహారాజా రాజు జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్ నుండి 1000 మంది పిల్లలను రక్షించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో.. మానవత్వం చాటుకున్న మహామనిషి ఆయన.
పోలాండ్ లో ఇప్పటికీ జమానగర్ రాజును ఇప్పటికీ గౌరవిస్తారు. 2016 లో, జామ్ సాహెబ్ మరణించిన 50 సంవత్సరాల తరువాత పోలాండ్ పార్లమెంటు ఆయనను సత్కరించడం గమనార్హం. పార్లమొత్తం ఏకగ్రీవంగా జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ ని రెండో ప్రపంచ యుద్ధంలో శరణార్థులకు చేసిన సహాయాన్ని స్మరించడంతోపాటు.. సత్కరించింది. పోలాండ్లోని శరణార్థులు కూడా జామ్నగర్ను ‘లిటిల్ పోలాండ్’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు., ఆ పేరుతో ఒక సినిమాని కూడా తెరకెక్కించారు.
కాగా... అంతటి గొప్ప చరిత్ర ఉన్న జామ్ నగర్ రాజ కుటుంబం నుంచి ప్రధాని మోదీకి ఈ తలపాగ బహుమతిగా లభించింది. వారి గౌరవార్థం మోదీ కూడా దానిని ఈ రోజు ధరించారు.
ఇదిలా ఉండగా... కొవిడ్-19 మహమ్మారి మధ్య నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి లేకుండా తక్కువ మందితో కవాతు సాగింది. కొవిడ్ ప్రోటోకాల్ మధ్య రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాఫెల్ ఫైటర్ జెట్ లు, టి-90 ట్యాంకులు, సామ్ విజయ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, సుఖోయ్-30 విమానాలు, ఎంకేఐ ఫైటర్ జెట్ లు విన్యాసాలు సాగించాయి.