ప్రధాని మోడీ విషసర్పం లాంటివ్యక్తి.. రుచి చూస్తే చస్తారు.. : మల్లికార్జున ఖర్గే
karnataka assembly election 2023: కర్నాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
'PM Modi A Poisonous Snake' Says Congress Chief: కర్నాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీని విషపూరిత పాముతో పోల్చారు. 'ప్రధాని మోడీ విషపూరిత పాము లాంటివారు, అది విషమా అని మీరు అనుకోవచ్చు. కానీ దాన్ని నాకుతే చచ్చిపోతారు' అని ఖర్గే వ్యాఖ్యానించారు.
వివరాల్లోకెళ్తే.. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ విషసర్పం లాంటివారని మండిపడ్డారు. దాన్ని ఎవరు రుచి చూసినా చచ్చిపోతారని చెప్పారు. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ "ప్రధాని మోడీ విషసర్పం లాంటి వాడు. విషం ఉందా లేదా అని మీరు ఆశ్చర్యపోతారు. కానీ రుచి చూస్తే చచ్చిపోతారు" అంటూ వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ చీఫ్ పై మండిపడింది. ఖర్గే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పార్టీ ఐటీ హెడ్ అమిత్ మాలవీయ షేర్ చేస్తూ కాంగ్రెస్ నైరాశ్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. "ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రధాని మోడీ విషపూరిత పాము అంటున్నారని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. సోనియా గాంధీతో మొదలైన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ క్రమంగా పతనమవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పట్టు కోల్పోతోందనడానికి ఈ నిరాశే నిదర్శనం" అని పేర్కొన్నారు. కాగా, తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత దూషణలు చేయను. బీజేపీని పాముగా అభివర్ణించానని చెప్పారు.
ప్రధాని మోడీపై ఖర్గే చేసిన వ్యాఖ్య దారుణమని బీజేపీ విమర్శించింది. మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిందని, కానీ ఆయనను ఎవరూ అలా భావించడం లేదని, అందుకే సోనియా గాంధీ ఇచ్చిన దానికంటే దారుణమైన ప్రకటన ఇవ్వాలని ఆయన భావించారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.