కోవిడ్ నివారణకు మార్గమిదే: దక్షిణాది సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
కరోనా పరిస్థితులపై దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో మోడీ ఇవాళ సమావేశమయ్యారు. కొన్నిరాస్ట్రాల్లో కరోనా కేసులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టెస్ట్, ట్రాక్,ట్రీట్ అనే విధానం ద్వారా కోవిడ్ ను అంతం చేయాలని ఆయన సీఎంలకు సూచించారు.
న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో నమోదౌతున్న కరోనా కేసులు ఇంకా ఆందోళన కల్గిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు కరోనా పరిస్థితులపై చర్చించారు.ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్పరెన్స్ ద్వారా కరోనా పరిస్థితులపై సమీక్షించారు.
కరోనాను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని సీఎంలను కోరారు. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. కేరళ, మహారాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయన్నారు. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం ద్వారా కోవిడ్ ను కంట్రోల్ చేయవచ్చన్నారు ప్రధాని.
గత వారంలో దేశంలో నమోదైన కేసుల్లో 80 శాతం ఈ రాష్ట్రాల్లో నమోదయ్యాయని మోడీ చెప్పారు. అంతేకాదు 84 శాతం మరణాలు కూడ ఈ రాష్ట్రాల్లోనే చోటు చేసుకొన్నాయన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్ వ్యూహాన్ని అనుసరించి కోవిడ్ ను అరికట్టాలని ఆయన సీఎంలకు సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం రూ. 23 వేల కోట్ల అత్యవసర ప్యాకేజీని తీసుకొచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులను ఉపయోగించాల్సిందిగా కోరారు. గ్రామీణ ప్రాంతాలపై కూడ దృష్టి కేంద్రీకరించాలన్నారు.ఇతర దేశాల్లో పిల్లలకు కరోనా సోకినట్టుగా నివేదికలు వచ్చాయన్నారు. మన పిల్లలను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరారు. కోవిడ్ ఇంకా మనతోనే ఉందని ప్రజలకు గుర్తు చేయాలన్నారు.