చిన్నారులతో ప్రధాని మోదీ రక్షా బంధన్ సెలబ్రేషన్.. వారంతా ఎవరంటే..
రాఖీ పండగను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని తన నివాసంలో బాలికలతో కలిసి జరుపుకున్నారు. తనకు రాఖీ కట్టిన బాలికలను ప్రధాని మోదీ నవ్వుతూ పలకరించారు.
ఆడపడుచులు తమ సోదరులపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండగ రాఖీ. అలాగే రాఖీ రోజున సోదరులు కూడా తమ తోబుట్టువులపై ఆప్యాయతను పంచుతారు. అలాంటి రాఖీ పండగను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని తన నివాసంలో బాలికలతో కలిసి జరుపుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే స్పీపర్స్, ప్యూన్లు, తోటమాలి, డ్రైవర్లు తదితరుల కుమార్తెలు ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారిని నవ్వుతూ పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వీడియోలో.. ప్రధాని మోదీ అధికారిక నివాసానికి వెళ్లిన బాలికలు ఆయనకు రాఖీలు కట్టడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా వరితో నవ్వుతూ మాట్లాడిన ప్రధాని మోదీ.. వారికి ఆశీస్సులు అందించారు. ఇక, ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. ‘‘ఈ యంగ్ స్టార్స్తో చాలా ప్రత్యేక రక్షాబంధన్..’’ అని పేర్కొన్నారు.
ఇక, అంతకుముందు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా రక్షా బంధన్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రక్షా బంధన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.