ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక పర్యటన చేపడుతున్న ప్రహ్లాద్ మోదీ.. తమిళనాడుకు చేరుకున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రహ్లాద్ మోదీని చికిత్స నిమిత్తం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ కిడ్నీ సంబంధిత చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తతం ప్రహ్లాద్ మోదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా ఆస్పత్రి వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
ఇక, గతేడాది డిసెంబర్ 27న కర్ణాటకలోని మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోదీ ప్రమాదానికి గురయ్యారు. ఆయన కుటుంబంతో కలిసి బందీపూర్ నుంచి మైసూర్ వెళుతుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు రెండు రోజుల పాటు అక్కడే చికిత్స పొందారు. అనంతరం వారు అహ్మాదాబాద్కు వెళ్లిపోయారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. అందులో నలుగురు సోదరులు సోమా మోదీ, అమృత్ మోదీ, పంకజ్ మోదీ, ప్రహ్లాద్ మోదీ, ఒక సోదరి వాసంతి మోదీ ఉన్నారు. ప్రహ్లాద్ మోదీ.. నరేంద్ర మోదీ కంటే చిన్నవారు. ప్రహ్లాద్ మోదీ.. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు.
