సారాంశం
Bhopal: రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఏ పథకమూ ఆగిపోదని పీఎం హామీ ఇవ్వాలన్న కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ డిమాండ్ పై మోడీ స్పందిస్తూ.. 'కాంగ్రెస్ ప్రభుత్వ కౌంట్ డౌన్ మొదలైందని గెహ్లాట్ కు తెలుసు. పథకాలను అడ్డుకోవద్దని బహిరంగంగానే విజ్ఞప్తి చేయడం ద్వారా ఒకరకంగా బీజేపీని అభినందించారు. బీజేపీ ప్రజాప్రయోజనాల ఏ పథకాన్ని ఆపదనీ, దానిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇది మోడీ గ్యారంటీ' అని అన్నారు.
PM Modi attacks Congress: పేదల మనోభావాలను ఉపయోగించుకునీ, కుల ప్రాతిపదికన సమాజాన్ని విడగొట్టి, ఒక కుటుంబాన్ని కీర్తిస్తూ ఓట్లు అడిగే దశాబ్దాల పాత మనస్తత్వాన్ని కాంగ్రెస్ విడనాడలేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ఆరు దశాబ్దాల క్రితం మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పేదల మనోభావాలను దోచుకుంటూ ఓట్లు అడిగే రాజకీయాలు చేస్తోందనీ, కుల ప్రాతిపదికన సమాజాన్ని విడగొట్టిందని విమర్శించారు. ఒక కుటుంబాన్ని కీర్తించడంలోనే తమ భవిష్యత్తు ఉందన్న కాంగ్రెస్ దార్శనికత గత ఆరు దశాబ్దాలుగా మారలేదని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ లోని పలు జిల్లాల గుండా వెళ్లే ఢిల్లీ-వడోదర ఎక్స్ ప్రెస్ వే సహా రూ.19,000 కోట్లకు పైగా విలువైన మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శల దాడి కొనసాగించారు. కాంగ్రెస్ అభివృద్ధి వ్యతిరేక మనస్తత్వం కలిగివుందనీ, ఆ పార్టీకి అభివృద్ధికి రోడ్ మ్యాప్ లేదని ఆయన ఆరోపించారు. ప్రపంచంలో దేశం ఖ్యాతి పెరగడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోయిందని విమర్శించారు. భారత్ లో భవిష్యత్తును ప్రపంచం చూస్తున్నప్పుడు వారు (కాంగ్రెస్) రాజకీయాల్లో తమ భవిష్యత్తును చూస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో దేశం ఎదుగుతున్న ఖ్యాతి పట్ల వారు (కాంగ్రెస్) సంతృప్తిగా లేనట్లు కనిపిస్తోందని ప్రధాని అన్నారు. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసిందనీ, రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించే అవకాశం కాంగ్రెస్ కు దక్కింది కానీ, 60 ఏళ్లలో వారు చేయలేనిది తొమ్మిదేళ్లలో తాము చేశామని చెప్పారు. అవినీతి, కుంభకోణాలు, నేరాలు, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలపై జరుగుతున్న అఘాయిత్యాలు దేశంలో ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనకు నిదర్శనమన్నారు. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వ గృహనిర్మాణ పథకాన్ని ఉదహరిస్తూ.. గతంలో కేంద్ర పథకాల కింద నిర్మించిన ఇళ్ల నాణ్యత చాలా పేలవంగా ఉండేదని, చాలా సందర్భాల్లో లబ్ధిదారులు ఒక్కసారి కూడా తమ ఇళ్లల్లో అడుగు పెట్టలేదన్నారు. గతంలో గృహనిర్మాణ పథకాల కింద ఇచ్చిన ఇళ్లు అంటే నాలుగు గోడలు మాత్రమే. కానీ, ప్రస్తుత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీటి సరఫరా, ఎల్పీజీ సిలిండర్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందించబడ్డాయని మోడీ తెలిపారు. దేశంలో ఈ పథకం కింద నాలుగు కోట్ల ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చామని తెలిపారు.
మహిళా సాధికారత ఓటు బ్యాంకు రాజకీయం కాదనీ, జాతి నిర్మాణ మిషన్ అని మోడీ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ గత కొన్ని దశాబ్దాలుగా హామీ ఇచ్చింది, కానీ తాము తీసుకువస్తే ఆ చట్టాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా మోడీ తన హామీకి హామీ ఇచ్చారని ఆయన అన్నారు. మరే పార్టీ కూడా ఈ ఘనత సాధించలేదని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ లో గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనుకబాటుతనానికి నెట్టి బీమారు రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు. కానీ, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం 'బీమారు' ఎంపీని దేశంలోని పది ఉత్తమ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి వేగానికి విఘాతం కలిగిస్తుందనీ, మళ్లీ వెనుకబాటుతనంలోకి నెట్టివేస్తుందన్నారు.