పైలట్ అవతారంలో ఎంపీ... షాకైన విమానంలోని మరో ఎంపీ..!
ఎంపీ దయానిధి మారన్ ప్రయాణిస్తున్న విమానం కెప్టెన్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి అవడం చూసి మారన్ షాక్ కి గురయ్యాడు. అదొక మర్చిపోలేని అనుభూతంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ని ముగించుకున్న ఎంపీ దయానిధి మారన్ ఢిల్లీ నుండి వెనక్కి వెళ్ళడానికి విమానం ఎక్కాడు. ఇంతలోనే విమానంలో బోర్డింగ్ పూర్తయిందని ఫ్లైట్ క్రూ ప్రకటించారు. ఇంతలోనే ముందు వరుసలో కూర్చున్న సదరు ఎంపీని... ఫ్లైట్ కెప్టెన్ మీరు కూడా ఇదే ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారా అని అడిగారు.
మాస్కు వేసుకొని ఉండడంతో కెప్టెన్ ఎవరనే విషయాన్ని మారన్ గుర్తుపట్టలేకపోయారు. గొంతు మాత్రం బాగా తెలిసిన గొంతులా అనిపిస్తుండడంతో... ఎవరా అని ఆలోచిస్తూనే అవును అని సమాధానం ఇచ్చారు. దయానిధి మారన్ ఇంకా తనను గుర్తుపట్టలేదు అని గ్రహించిన కెప్టెన్ నవ్వుతు నన్ను గుర్తుపట్టలేదా అని అనడంతో అప్పుడు ఒక్కసారిగా ఆ కెప్టెన్ ఎవరో కాదు కొన్ని గంటల ముందు తనతో పాటు సదరు పార్లమెంటరీ కమిటీ లో పక్కన కూర్చొని చర్చించిన ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ అని గ్రహించారు.
రెండు గంటల ముందు వరకు రాజకీయ నాయకుడిగా కమిటీలో మాట్లాడిన రూఢి ఇలా పైలట్ అవతారంలోకి మారడంతో దయానిధిమారన్ సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. తనను ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఫ్లైట్ కి కెప్టెన్ రూఢి అని గ్రహించిన ఎంపీ తన పూర్తి అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. ఫ్లైట్ ఎక్కినా దగ్గరి నుండి జరిగిన సంఘటనలను పూసగుచ్చినట్టు వివరించారు.
తాను తరచుగా ఇలా కెప్టెన్ అవతారంలో ఫ్లైట్స్ ని ఫ్లై చూస్తుంటానని రూఢి మారన్ ని చూసి నవ్వుతూ సమాధానమిచ్చారు. ఫ్లైట్ దిగిన తరువాత తన మిత్రుడు, సహచరుడు అయిన ఎంపీ నడిపిన ఫ్లైట్ లో ప్రయాణించడం ఎంతో గర్వంగా ఉందని మారన్ అన్నారు. తాను ఈ విషయం గురించి అందరికి చెబుతూనే ఉంటానని, ఇలా ఒక ఎంపీ కమర్షియల్ పైలట్ అవతారంలో ఉండడం చాలా చాలా అరుదని అన్నారు. తనతో పాటు తోటి ప్రయాణికులను ఢిల్లీ నుండి చెన్నై వరకు సురక్షితంగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు మారన్.
బీహార్ లోని ఛాప్రా నియోజకవర్గం నుండి ఎంపీగా కొనసాగుతున్న రాజీవ్ ప్రతాప్ రూఢి... 28వ ఏటనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రస్థానం ప్రారంభించిన రూఢి... ఆ తరువాత ఎంపీగా గెలుపొంది అటల్ బిహారి వాజపేయి, మోడీ మొదటి దఫా మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేసారు. ఆయన ట్రైన్డ్ కమర్షియల్ పైలట్. కెప్టెన్ హోదాలో విమానాల్ని నడుపుతుంటారు.