అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతుంటే.. కేరళలో మాత్రం తగ్గింపు
జూన్ 1 నుండి లీటర్ పెట్రోల్, డీజిల్ పై 1 రూ తగ్గింపు
దేశ వ్యాప్తంగా పెట్రోల్, బీజిల్ ధరలు పెరుగుతుంటే కేరళ లో మాత్రం జూన్ 1 తేదీ నుండి ఈ ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు ఈ వీటిపై విధించే పన్నులను తగ్గించుకుని రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్గించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశంలో అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ఈ ఇందన వనరుల ధరలను తగ్గించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికి దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా అమాంతం పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ధరల పెంపుపై అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడుతుండగా, రాష్ట్రాలు విధించే పన్నుల వల్లే వీటి ధరలు ఇంతలా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోపిస్తోంది. ఏదేమైనా సామాన్యుల కష్టాలను గుర్తించిన వామపక్ష పాలిత రాష్ట్రం ఇంధన ధరలకు కళ్లెం వేసేందుకు నడుం బిగించింది.
జూన్ 1వ తేదీ నుండి ఇంధనంపై విధించే రీటైల్ వాట్ను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలపై 1రూ తగ్గించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. అయితే దేశీయంగా ఇవాళ 1 పైసా ధర తగ్గడంతో పాటు కేరళ ప్రభుత్వం 1రూ తగ్గించనున్నట్లు ప్రకటించడంతో ఆ రాష్ట్ర ప్రజలకు కాస్త ఊరట కల్గించింది.