అలా చేస్తే పెట్రోల్పై రూ. 33 తగ్గుతుంది: చిదంబరం
కేంద్ర ప్రభుత్వం పలుసందర్భాల్లో విధించిన సెస్సులను తొలగిస్తే లీటర్ పెట్రోల్పై రూ. 33, లీటర్ డీజిల్పై రూ. 32 తగ్గుతుందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం అన్నారు. పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయని, ఇక ముందు ముందు మరింత పెట్రో బాదుడు మొదలవుతుందని జోస్యం చెప్పారు.
న్యూఢిల్లీ: ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పన్నులు, సెస్సులు, దిగుమతి సుంకాలను తగ్గించి ధరలకు కళ్లెం వేయాలని సూచించారు. సాధారణ సమయంలోనే ధరల పెరుగుదలను సహించేది లేదని, అలాంటిది కరోనాతో కుటుంబాలు కుదేలైన పరిస్థితుల్లో ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరాదని అన్నారు. ప్రభుత్వం ధరల తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తున్నదని విమర్శించారు.
విచక్షణారహితంగా సెస్ విధించడం వల్ల ధరలు తగ్గడం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై రూ 33, లీటర్ డీజిల్పై రూ. 32 సెస్సు విధిస్తున్నదని తెలిపారు. కేవలం ఈ సెస్సుల ద్వారానే కేంద్రం ప్రతియేటా రూ. 4.2 లక్షలు వసూలు చేస్తున్నదని చెప్పారు. ఎప్పుడో విధించిన సెస్సులను ఇంకా కొనసాగిస్తున్నదని, వీటిని తొలగించాలని సూచించారు.
ముందు ముందు ఇంకా పెట్రో బాదుడు
చమురు ధరల పెంపుపై చిదంబరం స్పందించారు. ‘కేంద్రం ఎల్పీజీ ధర రూ. 25 పెంచింది. తొమ్మిది నెలల్లో రూ. 265 పెంచింది. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలను అర్ధంతరంగా నిరవధిక వాయిదా వేసింది. ఇక ముందు ముందు మరింత బాదుడు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా పెరుగుతాయి. ప్రతి రోజు లేదా రెండ్రోజులకు ఒకసారి కేంద్రం బాదుడు షురూ చేస్తుంది’ అని ఆయన బుధవారం ట్వీట్ చేశారు.