సుప్రీంకోర్టుకు అదానీ-హిండెన్ బర్గ్ పై దర్యాప్తు పిటిషన్.. విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం
Gautam Adani Group: గౌతమ్ అదానీ సంస్థలపై హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో దేశంలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. వాణిజ్య మార్కెట్లు సైతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అదానీ సంస్థలు-హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
Supreme Court on Adani-Hindenburg report: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని వ్యాపార సంస్థపై ఆరోపణలు చేసిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ ను శుక్రవారం నాడు విచారించనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. గౌతమ్ అదానీ సంస్థలపై హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో దేశంలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. వాణిజ్య మార్కెట్లు సైతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష పార్టీలు దీనిపై విచారణ జరిపించడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అదానీ సంస్థలపై హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది విశాల్ తివారీ గురువారం నాడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని అత్యవసరంగా లిస్టింగ్ చేయాలని కోరారు. ఈ అంశంపై దాఖలైన ప్రత్యేక పిటిషన్ ఫిబ్రవరి 10న విచారణకు రానుందనీ, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనానికి ఆయన వివరించారు. ప్రత్యేక పిటిషన్ తో పాటు తన పిటిషన్ ను కూడా శుక్రవారం విచారించాలని ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు.
బడా కార్పొరేట్లకు ఇచ్చిన రూ.500 కోట్లకు పైగా రుణాల మంజూరు విధానాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశించాలని తివారీ తన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో కోరారు. అమాయక పెట్టుబడిదారులను దోపిడీ చేశారనీ, మార్కెట్లో అదానీ గ్రూప్ స్టాక్ విలువను కృత్రిమంగా కుప్పకూల్చారని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ కు చెందిన షార్ట్ సెల్లర్ నాథన్ అండర్సన్, భారత్, అమెరికాలోని అతని సహచరులపై ప్రాసిక్యూషన్ చేయాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్ శర్మ గత వారం సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలు చేశారు.
హిండెన్ బర్గ్ రీసెర్చ్ వ్యాపార సంస్థపై మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు వంటి ఆరోపణలు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను అబద్ధాలుగా కొట్టిపారేసింది, తాము అన్ని చట్టాలు కట్టుబడి ఉన్నామనీ, అన్ని విషయాల వెల్లడి ఆవశ్యకతలకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.
ఈ అంశంపై దాఖలైన ప్రత్యేక పిటిషన్ ఫిబ్రవరి 10న విచారణకు రానుందని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనానికి తివారీ తెలిపారు. ఇదే సమయంలో హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు దేశ ప్రతిష్టను దిగజార్చి నష్టాన్ని కలిగించిందనీ, రేపు కూడా ఇదే తరహా పిటిషన్ విచారణకు రానుందని ఆయన అన్నారు. ప్రత్యేక పిటిషన్ తో పాటు తన పిటిషన్ ను కూడా శుక్రవారం విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఆ పిటిషన్ ను కూడా ట్యాగ్ చేయండి అని సీజేఐ పేర్కొన్నారు.
వివిధ కారణాల వల్ల సెక్యూరిటీస్ మార్కెట్లో షేరు పడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ప్రజల పరిస్థితిని, భవితవ్యాన్ని ఈ పిటిషన్ తెలియజేస్తుందని తివారీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలాంటి స్టాక్స్ లో జీవితాంతం పొదుపు చేసిన చాలా మందికి ఇలాంటి షేర్లు పడిపోవడం వల్ల గరిష్టంగా ఎదురుదెబ్బ తగులుతుందనీ, భారీ మొత్తంలో డబ్బు నష్టాల్లోకి వెళ్తుందని పిల్ లో పేర్కొన్నారు. "బిలియనీర్ గౌతమ్ అదానీ సువిశాల సామ్రాజ్యంపై హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తరువాత, మొత్తం 10 అదానీ స్టాక్స్ మార్కెట్ విలువ సగానికి పడిపోయింది. పెట్టుబడిదారులు భారీ నష్టాలతో కూర్చున్నారు" అని తివారీ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నా అధికారులు ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పటిషన్ పేర్కొంది.