డోలో 650 టాబ్లెట్ల తయారీదారుపై హైకోర్టులో పిటిషన్.. ఆ స్కామ్ విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా
డోలో 650 టాబ్లెట్స్ తయారీదారైన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీపై దాని ఉద్యోగులు ఓ పిటిషన్ వేశారు. ఈ కంపెనీ గత 30 సంవత్సరాలుగా ఉద్యోగుల ఆరోగ్య బీమాను తప్పనిసరి చేయలేదని, తద్వార సుమారు రూ. 30 కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. అంతేకాదు, తమ టాబ్లెట్స్నే సూచించాలని చెబుతూ వైద్యులకు రూ. 1000 కోట్ల విలువైన గిఫ్ట్లను వారికి అందించినట్టు ఆరోపణలున్నాయి.
న్యూఢిల్లీ: డోలో 650 టాబ్లెట్స్ తయారు చేసే ఫార్మాస్యూటికల్ కంపెనీపై ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో శుక్రవారం ఓ పిటిషన్ ఫైల్ అయింది. ఈ కంపెనీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) స్కామ్కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ట్రయల్ కోర్టులో వివరాలు రికార్డ్ చేశారు.
డోలో 650 టాబ్లెట్ల తయారీదారైన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కామ్ (ఈఎస్ఐ స్కామ్)కు పాల్పడిందని కొందరు ఉద్యోగులు ఆరోపించారు. ఈ ఆరోపణలతోనే వారు ట్రయల్ కోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్ను అడ్వకేట్ ప్రదీప్ కుమార్ ద్వివేది.. జస్టిస్ రాజ్బీర్ సింగ్ ముందుకు తెచ్చారు. ఈ పిటిషన్ విచారణను న్యాయమూర్తి రాజ్బీర్ సింగ్ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేశారు.
గత 30 ఏళ్లుగా ఈ కంపెనీ తన ఉద్యోగులకు ఆరోగ్య బీమాను తప్పనిసరి చేయలేదని, దీని ద్వారా కంపెనీ సుమారు రూ. 30 కోట్లు మింగేసిందని పిటిషన్లో పేర్కొన్నారు.
Also Read: Dolo-650: ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్లకు రూ.1000 కోట్లు.. Dolo-650 అమ్మకాలపై 'సుప్రీం' ఆగ్రహం
అంతేకాదు, ఫీవర్ ఉన్నదని చెప్పేవారందరికీ తమ టాబ్లెట్స్నే సూచించాలని వైద్యులకు సూచిస్తూ.. వారిని ప్రలోభపెట్టడానికి రూ. 1000 కోట్ల విలువైన బహుమతులను (గిఫ్ట్స్) అందించినట్టు ఆరోపించారు. ఈ కేసును ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలిస్తున్నది.