పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 29 వరకు జరుగనున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జనన మరియు మరణ నమోదు చట్టం 1969కి సవరణను ప్రతిపాదించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 న ప్రారంభమై డిసెంబర్ 29 వరకు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం.. జనన మరియు మరణ డేటాబేస్ ద్వారా జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) నవీకరణను అనుమతించడానికి బిల్లును ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా.. జనన మరియు మరణ డేటాబేస్ ను నిర్వహించడానికి ఎన్పీఆర్ ని నవీకరించడానికి బిల్లు అనుమతించనున్నది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జనన మరణాల నమోదు (RBD) చట్టం 1969ని సవరించే ముసాయిదా బిల్లును ప్రజల అభిప్రాయాలు,సూచనల కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది అక్టోబర్‌లో సమర్పించింది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం..ఎలక్టోరల్ రోల్స్, ఆధార్ డేటాబేస్, రేషన్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లను నవీకరించడానికి కూడా డేటా ఉపయోగించబడుతుంది.

డిసెంబరు 6న అఖిలపక్ష సమావేశం 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం కానున్నది. డిసెంబర్ 6వ తేదీన అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరగనుంది, దీనిలో సెషన్ లో ప్రవేశపెట్టనున్న బిల్లులు, అజెండా , ముఖ్యమైన అంశాలు చర్చించబడతాయి. ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ, రాజ్యసభల్లోని రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపారు. డిసెంబర్ 7న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై.. డిసెంబర్ 29న ముగుస్తాయి. ఈ సెషన్‌లో 17 సభలు జరగనున్నాయి. లోక్‌సభ, రాజ్యసభలు వేర్వేరుగా నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమైన తేదీల వివరాలను కూడా విడుదల చేశారు.

G20 అధ్యక్ష పదవిపై ప్రభుత్వం అన్ని పార్టీలకు సమాచారం 

వచ్చే నెలలో జి20 అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టనుంది. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో అన్ని రాజకీయ పార్టీల అధినేతల సమావేశానికి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో జీ20 అధ్యక్ష పదవిని చేపట్టేందుకు భారత్ వ్యూహాన్ని ప్రభుత్వం రాజకీయ పార్టీలకు తెలియజేస్తుంది. ఈ ప్రత్యేక సమావేశానికి హాజరు కావాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆహ్వాన లేఖలు పంపారు. ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి జీ20 షెర్పా అమితాబ్ కాంత్ కూడా హాజరు కానున్నారు. డిసెంబర్ 1 నుంచి ఏడాదిపాటు జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టనుంది.